Fact Check:రహదారులపై పిచికారి చేస్తున్న క్రిమిసంహారక మందు వైరస్ను చంపేస్తుందా..?
జెనీవా: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయ దేశ ప్రభుత్వాలు పలు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ముందుగా వ్యక్తిగత పరిశుభ్రత ఆ తర్వాత పరిసరాల శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పరిసరాల శుభ్రత విషయంకు సంబంధించి రోడ్లను క్రిమిసంహారక మందుతో పిచికారి చేస్తున్నారు.
ఇలా చేయడం వల్ల కరోనావైరస్ను చంపలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేసింది. అంతేకాదు క్రిమిసంహారక మందుతో ఆరోగ్యానికి మరింత హాని కలుగుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. డిసిన్ఫెక్టెంట్స్తో కరోనావైరస్ నుంచి విముక్తి పొందలేమని అత్యున్నత సంస్థ పేర్కొంది.
రహదారులు, మార్కెట్ స్థలాల్లో క్రిమిసంహారక మందును పిచికారి చేయడం వల్ల ఉపయోగం లేదని వెల్లడించింది. రోడ్లపై పేరుకుపోయిన చెత్త ఇతర వేస్టులు క్రిమిసంహారక మందును యాక్టివ్గా పనిచేయకుండా చేస్తాయని వెల్లడించింది ప్రపంచ ఆరోగ్యసంస్థ.
రహదారులు లేదా ఫుట్ పాత్లకు కరోనావైరస్ కేరాఫ్ అడ్రస్ కాదని చెప్పిన ప్రపంచ ఆరోగ్యసంస్థ డిసిన్ఫెక్టెంట్స్ వల్ల మనిషి ఆరోగ్యం కూడా ప్రమాదంలోకి నెట్టివేయబడుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ మద్యకాలంలో వ్యక్తులపై కూడా స్ప్రేయింగ్ చేస్తున్నారని అది హానికరమని హెచ్చరించింది సంస్థ.
ఇలాంటి క్రిమిసంహారక మందులు శరీరంపై పడితే కళ్లు, మరియు చర్మం సంబంధిత వ్యాధులు వస్తాయని పేర్కొంది. ఇక ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఒక వేల ఫలానా పరిసరాలను శుభ్రం చేయాలంటే బట్టను ఆ క్రిమిసంహారక మందు ఉన్న బకెట్లో ముంచి ఆపరిసరాలను క్లీన్ చేయాలని పేర్కొంది.
ఇక అత్యంత ప్రమాదకరంగా మారిన కరోనావైరస్ ఇప్పటికే 3లక్షల మందిని పొట్టనబెట్టుకోగా చాలామంది దీనిబారిన పడి చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ఎక్కడైనా ఉండే అవకాశం ఉందని మరోసారి స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే ఒక్కో వస్తువుపై ఈ వైరస్ ఎంత కాలం జీవించి ఉంటుందనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవని వెల్లడించింది.