కరోనా సోకకుండా ఉండటానికి ఆ వంటింటి చిట్కా పని చేయదట: నమ్మొద్దంటోన్న నిపుణులు..!
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి చైనాకు చెందిన ఓ వైద్యశాస్త్ర నిపుణుడు వంటింటి చిట్కాను చెప్పారు. సాధారణంగా జలుబు బారిన పడిన సమయంలో వేడి నీటిలో కొన్ని జామాయిల్ ఆకులు గానీ లేదా కొంత ఝండూబామ్ను గానీ వేసి ఆవిరి పీల్చుతుంటారు. కరోనా వైరస్ దరి చేరకుండా ఉంటానికి అదే ఫార్ములాను ఫాలో కావొచ్చంటూ చైనాకు చెందిన ఓ వైద్య శాస్త్ర నిపుణుడు వెల్లడించినట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదట. వేడి నీటి ఆవిరిని పట్టడం వల్ల ఉపయోగం ఉండబోదని తాజాగా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కరోనా వైరస్ మన శరీర అంతర్భాగంలోనికి వెళ్లి, ఊపిరి తిత్తులు లేదా ఇతర అవయవాల్లో తిష్ట వేయడానికి ముందే ఈ చిట్కాను పాటించడం వల్ల దాన్ని దరిచేరనివ్వకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవచ్చంటూ కొద్దిరోజులుగా వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఓ మెసేజ్ పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతోంది. నీరు బాగా మరిగే సమయంలో వెలువడే ఆవిరిని పీల్చడం వల్ల ముక్కు, గొంతులో చేరిన వైరస్ సైతం ఎక్కువ సేపు జీవించలేదని, వేడి వాతావరణం, వేడి ఆవిరిని తట్టుకునే శక్తి కరోనా వైరస్కు లేదని, వేడి నీటి ఆవిరిని పీల్చడం వల్ల వందశాతం ఫలితం ఉంటుందనేది ఆ మెసేజ్ సారాంశం.
అలాంటి మెసేజీలను నమ్మొద్దని అధికారులు చెబుతున్నారు. వేడి నీటిని పిల్చడం వల్ల కరోనా వైరస్ మటుమాయం అవుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అలాంటి నిరాధారమైన సమాచారాన్ని ఎవరూ విస్మరించొద్దని సూచిస్తున్నారు. దీనికి బదులుగా- చేతులను శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడం, ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండటం వల్ల ఆశించిన ఫలితాలు వస్తాయని, ఇలాంటి సమాచాారన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని కోరుతున్నారు. కాగా- వైరస్ను నివారించడానికి అవసరమైన మందులు ఇప్పటిదాకా ఎవరూ కనుగొనలేదని అన్నారు.