అగ్రరాజ్య సరిహద్దులో నలుగురు మృతి.. వారంతా భారతీయులే..
అమెరికా-కెనడా సరిహద్దుల్లో నాలుగు మృతదేహాలను గుర్తించారు. మృతులు భారతీయులేనని అధికారులు గుర్తించారు. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి.. వీరందిరినీ అక్రమంగా అమెరికాలోకి తీసుకెళ్తానని నమ్మబలికి వారి వద్ద నుంచి డబ్బులు తీసుుకొని చివరికి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడని తెలుస్తోంది. మంచు తుఫాను సమయంలో బోర్డర్ క్రాసింగ్ ప్రయత్నం విఫలమై తీవ్రమైన చలికి గురికావడం వల్ల నలుగురు చనిపోయారని స్థానిక అధికారులు గుర్తించారు.
మానిటోబా ప్రావిన్స్లో గల రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఏం జరిగిందో తెలియజేసింది. బుధవారం ఉదయం కెనడాలోని మనిటోబా ఫ్రావిన్స్ నుంచి కొందరు అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించారు. వారిని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్అధికారులు పట్టుకున్నారు. కెనడాలోని మనిటోబా ఫ్రావిన్స్ రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్లకు అమెరికా సమాచారాన్ని అందించింది. పట్టుబడినవారిలో ఒకరి వద్ద పసిబిడ్డకు సంబంధించిన వస్తువులు ఉన్నాయని, అయితే ఏ శిశువు కూడా పట్టుబడినవారి వద్ద లేరని అమెరికా నుంచి సమాచారం అందడంతో కెనడియన్ మౌంటెడ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
నాలుగు గంటల తర్వాత కెనడా సరిహద్దులో ఎమర్సన్ పట్టణానికి దగ్గరగా ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను అధికారులు కనుగొన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగించగా కొద్ది సేపటి తర్వాత మరో వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. వీరందరినీ అక్రమంగా అమెరికాలోకి తీసుకెళ్తానని ఓ వ్యక్తి వీరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడని, అయితే అమెరికా అధికారులు సరిహద్దు దాటిన కొందరు దొరికిపోయారు అనే సమాచారం రావడంతో వీరిని మధ్యలోనే వదిలి వెళ్లిపోయాడని అధికారులు గుర్తించారు.
బుధవారం రోజే కెనడియన్ సరిహద్దుకు దక్షిణంగా పావు మైలు దూరంలో చట్టవిరుద్దంగా యూఎస్ లోకి ప్రవేశించిన ఐదుగురు భారతీయ పౌరులను అమెరికా పోలీసులు పట్టుకున్నారు. ఎవరైనా వచ్చి తమను తీసుకెళ్తారని ఆశించి సరిహద్దు గుండా నడిచామని,11 గంటలకు పైగా నడుస్తూనే ఉన్నామని పట్టుబడిన వారు పోలీసులకు వివరించారు. పట్టుబడినవారిలో ఒకరి దగ్గర ఉన్న బ్యాక్ప్యాక్లో పిల్లల బట్టలు, డైపర్, బొమ్మలు మరియు కొన్ని పిల్లలకు మందులు ఉన్నాయి.
Recommended Video
మరో నలుగురు భారతీయులు ముందు రోజు వరకు తమతో పాటే కలిసి నడిచారని, రాత్రి సమయంలో విడిపోయారని అధికారులకు తెలిపారు. ఈ వస్తువులు వారివేనని తెలిపారు. కెనడా సరిహద్దుల్లో అధికారులు గుర్తించిన మృతదేహాలు విడిపోయిన నలుగురివిగా ప్రాథమికంగా గుర్తించారు. బాధిత వ్యక్తులు మంచు తుఫాను మధ్యలో ఒంటరిగా మిగిలిపోయారని, తీవ్రమైన చలి కారణంగా వీరు చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు. చనిపోయిన నలుగురిలో పసిపాప, ఒక యువకుడు, ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉన్నారని అధికారులు తెలిపారు.