దారుణం: మూడేళ్ల బాబు ఏడుపు ఆపలేదని విమానంలో నుంచి బయటకు పంపారు
లండన్ : విమానంలో ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి ఏడుస్తున్నాడని ఆ కుటంబాన్ని నిర్దాక్షిణ్యంగా బయటకు దించేసింది బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థ. జూలై 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లండన్ నుంచి బెర్లిన్కు వెళుతున్న బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన విమానంలో (BA 8495) ఓ భారతీయ కుటుంబం కూడా ప్రయాణించింది. ఆ కుటుంబంలోని మూడేళ్ల బాబు గుక్కపెట్టి ఏడుస్తుండటంతో ఆ విమాన సిబ్బంది లండన్లో ఆ కుటుంబాన్ని దించేశారు.
విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో చిన్నారి.. ఎలాంటి ఇబ్బందికి గురయ్యాడో ఏమో తెలియదు కానీ... ఏడుపు మొదలు పెట్టాడు. అప్పటికీ తల్లి ఆ బిడ్డను సముదాయించేందుకు చాలా ప్రయత్నించింది. కానీ ఆ చిన్నారి మాత్రం ఏడుపు ఆపలేదు. ఇది గమనించిన విమానం సిబ్బంది... ఆ చిన్నబాబు దగ్గరికి వచ్చి అతనిని గదురుకునే ప్రయత్నం చేశారు. విమానం సిబ్బంది చేష్టలకు బెదిరిపోయిన బాబు మరింత గట్టిగా ఏడ్చాడు. అప్పటికే టేకాఫ్ అయిన విమానం తిరిగి టెర్మినల్కు చేరుకుంది. వెంటనే దిగిపోవాలని సిబ్బంది తమతో చెప్పినట్లు చిన్నారి తండ్రి తెలిపారు.
విమానం సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తండ్రి పౌరవిమానయానాశాఖా మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాశాడు. విమానంలోని సిబ్బందిలో ఒకాయన తన కొడుకును దూషించాడని, బెదిరించాడని లేఖలో పేర్కొన్నాడు. వారి చర్యలకు తన కొడుకు బెదిరిపోయి మరింత గట్టిగా ఏడ్చాడని చెప్పిన తండ్రి...తమ వెనకాలే కూర్చొన్న మరో భారతీయ కుటుంబం తన కొడుకును ఓదార్చే ప్రయత్నం చేశారని చెప్పాడు. ఆ తర్వాత అబ్బాయిని తీసుకుని తన భార్య సీటులో కూర్చోబెట్టి సీటుబెల్టు కట్టిందని వివరించాడు. విమానం రన్వేపై వెళుతున్న సమయంలో మరోసారి అదేమనిషి వచ్చి... "ఏడుపు ఆపుతావా లేదా... ఇలానే ఏడిస్తే విమానం కిటికీలోనుంచి బయటకు తోసేస్తా" అంటూ మాటలతో దండించాడని చిన్నారి తండ్రి లేఖలో తెలిపాడు.
గాలిలో ఉన్న విమానం తిరిగి విమానాశ్రయానికి చేరుకుందని లేఖలో పేర్కొన్న బాబు తండ్రి... ఆ తర్వాత కొద్ది సేపటికి సెక్యూరిటీ వారు వచ్చి తమ బోర్డింగ్ పాసులను తీసుకుని విమానం దిగాల్సిందిగా కోరినట్లు వివరించాడు. అంతేకాదు విమాన సిబ్బంది తమపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారని తెలిపాడు. తమకు జరిగిన అవమానంపై సీరియస్గా పరిగణించి ఆసిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాబు తండ్రి లేఖలో సురేష్ ప్రభును కోరారు. అయితే ప్రయాణికుడితో తాము టచ్లో ఉన్నామన్న విమాన యాజమాన్యం.. జాత్యాహంకార వ్యాఖ్యలు చేసి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని చెప్పింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని యాజమాన్యం స్పష్టం చేసింది.