అగ్ర దేశమే, ట్రంప్ మారతారు?: చివరి ప్రసంగంలో ఒబామా ఉద్వేగం
దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే సమయం వచ్చిందని, వారికి కృతజ్ఞతలు తెలిపేరోజు ఇదేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన చివరి ప్రసంగంలో ఉద్వేగానికి లోనయయ్యారు.
చికాగో: అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చివరి ప్రసంగం ఉద్వేగభరితంగా సాగింది. దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే సమయం వచ్చిందని, వారికి కృతజ్ఞతలు తెలిపేరోజు ఇదేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన చివరి ప్రసంగంలో కంటతడి పెడుతూ ఉద్వేగానికి లోనయయ్యారు. నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాస్వామ్య పాలనకు అనుకూలంగా మారతారని ఆశిస్తున్నట్లు ఒబామా తెలిపారు.
చికాగోలో బుధవారం ఆయన ప్రసంగం ఎంతో ఉద్వేగభరితంగా కొనసాగింది. ఆయన చివరి ప్రసంగం కావడంతో సమావేశానికి భారీగా ప్రజలు హాజరయ్యారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ఒబామాకు వీడ్కోలు ప్రసంగానికి డెమొక్రటిక్ పార్టీ నేతలు, ఇతర కీలక నేతలు, అధికారులు హాజరయ్యారు. మరోవైపు ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.
విశ్వాసం అంటే ఏంటో తాను చికాగో ప్రజల నుంచి నేర్చుకున్నానని ఒబామా అన్నారు. ప్రతిరోజు మీ నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటేనే ఉన్నానని, దేశ ప్రజలందరూ కలిసి తనను బెట్టర్ ప్రెసిడెంట్గా, ఉత్తమ వ్యక్తిగా చేశారని ఒబామా వ్యాఖ్యానించారు.
'మన దేశాన్ని ప్రత్యేకంగా నిలుపుకునే సామర్థ్యం మనకు ఉంది. ప్రజల మద్ధతు వల్లే అధ్యక్షుడిని కాగలిగాను. గత కొన్నేళ్లుగా నన్ను, మిషెల్లీ ఒబామాను ఎంతగానో ఆదరించారు. అందుకు మీకు మరోసారి ధన్యావాదాలు తెలియజేసుకుంటున్నాను' అని ఒబామా తెలిపారు.
'గత పదేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యం ఎంతో మెరుగుపడింది. సామాన్య ప్రజలు స్పందించినప్పుడే మార్పు అనేది సాధ్యపడుతుంది. అందరూ కలిసికట్టుగా ఇదే తీరుగా భవిష్యత్తులోనూ పోరాటం సాగించాలి' అని ఒబామా పిలుపునిచ్చారు.
అమెరికన్లు.. విలువల పతనం, జాతివివక్ష తదితర విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశ యువత, కృషి, వైవిధ్యం, పారదర్శకత, తెగింపు, పునఃసృష్టిస్తే భవిష్యత్తు మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. జాతి వివక్షపై మరింత బలమైన చట్టాలు ఉండాలన్నారు. దీనిలో మన రాజ్యాంగం.. ఆదర్శాలు ప్రతిబింబించాలని ఆకాంక్షించారు.
తనకు అమెరికాపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. అమెరికన్లకు పునఃసృష్టి చేసే అచంచలమైన శక్తి ఉందన్నారు. భవిష్యత్తు అమెరికాదే అని స్పష్టం చేశారు. అమెరికా ప్రజాస్వామ్యం పనిచేస్తే ఆ శక్తి భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. మన రాజకీయాలు దేశ ప్రజలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. పార్టీలకు, ఆసక్తులకు అతీతంగా సమష్టి ప్రయోజనం కోసం పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
మనం భయాన్ని పెంచితే ప్రజాస్వామ్యం బలహీనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మనల్ని ఈస్థాయికి తీసుకొచ్చిన విలువలకు పరిరక్షణగా ఉందాం.. అందుకే నేను ముస్లిం అమెరికన్లపై వివక్షను ఏ మాత్రం అంగీకరించను అని పేర్కొన్నారు.అదే సమయంలో అక్కడ ఉన్న వారంతా 'చివరిగా ఇంకొక్కసారి' అని కోరడంతో ఒబామా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.
కాగా, ట్విన్ టవర్స్ కూల్చిన ఉగ్రవాదిని అంతం చేశామని ఆయన తెలిపారు. ప్రపంచంలో అమెరికానే అగ్రదేశమని అన్నారు. ఆ సామర్థ్యాన్ని నిలుపుకునే శక్తి తమ దేశానికి ఉందని అన్నారు. చివర్లో 'మేము చేయగలం.. మేము చేశాము' అని నినదించారు.