వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడుల వెల్లువ: మోడీ సర్కార్కు అండగా: గుట్టు విప్పిన అమెరికా
వాషింగ్టన్: దేశ రాజధానిని అట్టుడికిస్తోన్న వ్యవసాయ బిల్లుల వ్యవహారంలో క్రమంగా కేంద్రానికి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు, మాజీ క్రికెటర్లు.. ఈ బిల్లుల వివాదంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అక్షయ్ కుమార్, లతా మంగేష్కర్, సచిన్ టెండుల్కర్ వంటి ప్రముఖులు వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మోడీ సర్కార్కు అండగా నిలిచింది. వ్యవసాయ బిల్లులను తాము స్వాగతిస్తున్నామని తెలిపింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించేలా కేంద్రం ఆ బిల్లులను రూపొందించిందని తాము అంచనా వేస్తున్నామని పేర్కొంది. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టదలిచిన బిల్లుల వల్ల ఆ దేశ వ్యవసాయ రంగం మరింత బలోపేతమౌతుందని తెలిపింది. పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి కారణమౌతుందని వైట్హౌస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో నిరసనలు తెలపడం ప్రజాస్వామ్యానికి హాల్ మార్క్ వంటివని రైతుల మహోద్యమాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొనడం సహేతుకం కాదని చెప్పారు.
Recommended Video
వ్యవసాయ బిల్లులపై నెలకొన్న వివాదాలను రెండు పక్షాలు శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ దిశగా తక్షణ చర్యలను చేపట్టాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని సూచించిందని వైట్హౌస్ అధికార ప్రతినిధి గుర్తు చేశారు. కొత్త బిల్లుల ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేలా భారత ప్రభుత్వం రూపొందించిన బిల్లులను తాము స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు.