అది భారత అంతర్గత విషయం: మాకు సంబంధం లేదు: హద్దులు దాటితే: తేల్చేసిన బ్రిటన్
లండన్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా సుదీర్ఘకాలంగా కొనసాగుతోన్న రైతుల ఆందోళనల్లో జోక్యం చేసుకోవడానికి, ఆ అంశంపై స్పందించడానికి ప్రపంచ దేశాలేవీ పెద్దగా ఆసక్తి చూపట్లేదు. వ్యవసాయ బిల్లులను సమర్థిస్తూ అగ్రరాజ్యం అమెరికా ఇదివరకే ఓ ప్రకటన చేసింది. వాటిని తాము స్వాగతిస్తున్నామని పేర్కొంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకుని రావడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా దాన్ని అభివర్ణించింది.
తాజాగా బ్రిటన్ కూడా తన వైఖరేమిటో స్పష్టం చేసింది. రైతు ఉద్యమం.. భారత అంతర్గత విషయంగా పేర్కొంది. అందులో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ అంశంపై బ్రిటన్ పార్లమెంట్లో డిబేట్ నడిచింది. భారత సంతతికి చెందిన సభ్యులు దీన్ని లేవనెత్తారు. బ్రిటన్లో నివసించే భారత సంతతీయులు రైతు దీక్షలకు మద్దతుగా రూపొందించిన ఆన్లైన్ పిటీషన్పై సంతకాలను సేకరిస్తోన్నారు. ఈ సంతకాల సేకరణ లక్ష మార్క్కు దాటింది. సుదీర్ఘకాలం పాటు ఉద్యమాన్ని కొనసాగిస్తోన్న రైతులకు సంఘీభావాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందంటూ భారత సంతతికి చెందిన ఎంపీలు పేర్కొన్నారు.
దీనిపై ఆసియా వ్యవహారాల శాఖ మంత్రి నైగెల్ ఆడమ్స్ స్పందించారు. అది భారత అంతర్గత విషయమని తేల్చి చెప్పారు. భారత్-బ్రిటన్ మధ్య గల సన్నిహిత సంబంధాలను ప్రభావితం చేయలేవని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని, శాంతియుత వాతావరణంలో నిరసనలను తెలియజేసే హక్కు ప్రజాస్వామ్యం కల్పించిందని అన్నారు. అలాగనీ-హద్దులను దాటితే మాత్రం దాన్ని నియంత్రించడానికి భద్రతా బలగాలను వినియోగించాల్సిన అవసరం ఉందనీ చెప్పారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రైతు ఉద్యమ స్థితిగతులను తాము ఎప్పటికప్పుడు భారత హైకమిష్ కార్యాలయం ద్వారా పర్యవేక్షిస్తోన్నామని చెప్పారు.రైతుల సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం పలుమార్లు రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపిన విషయం కూడా తమ దృష్టిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ చర్చలు సానుకూల వాతావరణంలో, పరస్పర అంగీకారంతో, అందరికీ మేలు కలిగేలా ముగుస్తాయని తాము ఆశిస్తున్నట్లు నైగెల్ ఆడమ్స్ చెప్పారు.