వైఖరి మార్చుకోండి లేదా బ్లాక్లిస్టులో పెడతాం: పాకిస్తాన్కు ఎఫ్ఏటీఎఫ్ వార్నింగ్
ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చే సంస్థలపై డేగకన్ను వేసి అడ్డుకునే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సంస్థ పాకిస్తాన్కు గట్టి హెచ్చిరికలు జారీ చేసింది. ఎఫ్ఏటీఎఫ్ విధించిన 27 లక్ష్యాలను పాకిస్తాన్ అందుకోవడంలో విఫలమవడంతో ఇకపై జాగ్రత్తలు తీసుకోకపోతే బ్లాక్లిస్టులో చేరుస్తామని సంస్థ హెచ్చరించింది. ఇందుకు సమయం 4 నెలలు ఇచ్చింది.
ఫిబ్రవరి 2020 నాటికల్లా పాకిస్తాన్ ఒక ప్రణాళికను సిద్దం చేసుకుని దాన్ని అమలు చేయాలని సంస్థ చెప్పింది. అయితే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ తీసుకుంటున్న చర్యలు చూస్తే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే కనిపిస్తోందని భారత్ చెబుతోంది. బయటకు మాత్రం ఉగ్రవాదంను అణిచివేస్తున్నామని చెబుతున్న ఇమ్రాన్ఖాన్.. అతని చర్యలు చూస్తే అందులో సీరియస్నెస్ కనిపించదని చెప్పారు.
ఒక వేళ పాకిస్తాన్ను బ్లాక్లిస్టులో చేరిస్తే పాకిస్తాన్కు ఇతర దేశాల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. అసలే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పాకిస్తాన్ ను ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్లిస్టులో చేర్చాలని భారత్ విపరీతంగా ప్రయత్నిస్తోందని గత నెలలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా పాక్ ప్రధాని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇరాన్ దేశం ఇప్పటికే ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్లిస్టులో కొనసాగుతోంది.
ఇరాన్పై యూరోపియన్ దేశాల ఏకాభిప్రాయం సన్నగిల్లిపోతుండటం, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతుండటంతో ఇరాన్ను బ్లాక్లిస్టులో చేర్చింది. ఫిబ్రవరి 2020 లోగా ఎఫ్ఏటీఎఫ్ గైడ్లైన్స్ ప్రకారం ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని సంస్థ పేర్కొంది.