శ్రీలంక ఆత్మాహూతి దాడుల సూత్రధారి తండ్రి కాల్చివేత
కొలంబో: ఈస్టర్ సండే నాడు రాజధాని కొలంబో సహా పలు ప్రాంతాల్లో నరమేథాన్ని సృష్టించిన ఆత్మాహూతి దాడుల సూత్రధారి తండ్రి మహమ్మద్ హషీమ్ పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక పోలీసులు, అతని కుటుంబీకులు ధృవీకరించారు. రెండు రోజుల కిందట పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను మరణించినట్లు తేలింది. ఈ కాల్పుల్లో మొత్తం 15 మంది మరణించగా.. వారిలో ఆత్మాహూతి దాడుల సూత్రధారి తండ్రి కూడా ఉన్నట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.
సూత్రధారులు..అన్నదమ్ములు
జైనీ హషీమ్ ఆలియాస్ జెహ్రెయిన్ హషీమ్, రిల్వాన్ హషీమ్ అనే ఇద్దరు ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆత్మాహూతి దాడులకు సూత్రధారులు. జైనీ హషీమ్ బట్టికలోవాలోని చర్చిపై దాడి చేసి, తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 70 మందికి పైగా మరణించారు. అతని సోదరుడు రిల్వాన్ హషీమ్ కొలంబోలో సిన్నామన్ హోటల్ పై ఆత్మాహూతి దాడి చేశాడు. ఇక్కడా పదుల సంఖ్యలో పర్యాటకులు మృత్యువాత పడ్డారు. హషీమ్ సోదరుల కుటుంబ నేపథ్యం గురించి పోలీసులు ఆరా తీశారు. వారిద్దరి ఆనుపానులు కనుగొన్నారు. ఇంటిపై దాడులు చేశారు.
ఎదురు కాల్పులు..
రాజధాని కొలంబో నుంచి సుమారు 350 కిలోమీటర్ల దూరంలోని సమ్మన్ థునై ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. సమ్మన్ థునైలోని హషీమ్ సోదరుల ఇంటిపై భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో 15 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మరణించిన వారిలో మహమ్మద్ హషీమ్ కూడా ఉన్నాడని పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తోంది. దాడులకు పాల్పడటానికి ముందు హషీమ్ సోదరులు ఇద్దరూ ఈ వీడియోలో కనిపించినట్లు చెబుతున్నారు.
వారంరోజుల తరువాత కూడా..
సరిగ్గా వారం రోజుల కిందట అంటే- ఈస్టర్ సండే నాడు వరుసగా చోటు చేసుకున్న బాంబు పేలుళ్లు, ఆత్మాహూతిదాడులు శ్రీలంకను అల్లకల్లోలానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈస్టర్ సండే నాడు ఒక్కరోజే కొలంబో, బట్టికలోవా సహా పలు ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. చర్చిలు, హోటళ్లను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆత్మాహూతిదాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 253 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆ ఘటన తరువాత కూడా మరో రెండురోజుల పాటు దేశంలో తరచూ ఏదో ఒక చోట పేలుళ్లు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఈ దాడులకు తామే బాధ్యులమంటూ భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించుకుంది.
అణువణువూ జల్లెడ..
ఆత్మాహూతి దాడులు చోటు చేసుకుని వారంరోజులు గడిచినప్పటికీ.. శ్రీలంకలో సాధారణ పరిస్థితులు నెలకొనట్లేదు. ఆదివారం నాడు కూడా దేశ వ్యాప్తంగా చర్చిల్లో సామూహిక ప్రార్థనలను రద్దు చేశారు. చర్చిల్లో మాత్రమే కాకుండా- మసీదుల్లో కూడా సామూహిక ప్రార్థనలపై తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. పలు చోట్ల క్రైస్తవులు తమ నివాసాల్లోనే ఆదివారం నాటి ప్రార్థనలను నిర్వహించారు. ఆత్మాహూతిదాడులను దృష్టిలో ఉంచుకుని చర్చిలు, మసీదులకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దాడుల అనంతరం ఏకంగా 10 వేల మంది పోలీసులు, భద్రతా బలగాలను మోహరింపజేశారు. ఉగ్రవాదుల కోసం వారు అన్వేషణ కొనసాగిస్తున్నారు. అణువణువూ జల్లెడ పడుతున్నారు.