తల్లులు కాదు.. చైనాలో తండ్రులే పిల్లలకు పాలిస్తున్నారు
మద్దతును, నిరసనను వ్యక్త పరచడంలో ఒక్కొక్కరిది ఒక్కో పంథా. అయితే.. విషయం జనంలోకి బలంగా వెళ్లడం కోసం ఈ మధ్య వెరైటీగా తమ వైఖరిని వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. ఇదే తరహాలో చైనాలో వినూత్న తీరులో తమ వైఖరిని స్పష్టం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు కొంతమంది పురుషులు.
ప్రపంచ మాతృధినోత్సవాన్ని పురస్కరించుకుని పిల్లలకు తల్లి పాల ప్రాముఖ్యతను గురించి ప్రచారం చేయాలనుకున్న కొంతమంది పురుషులు, తమ చొక్కాలు విప్పి బొమ్మలకు పాలు ఇచ్చారు. తల్లి తన పిల్లలకు పాలు ఇస్తున్న తరహాలో బొమ్మలకు పాలిచ్చిన పురుషులు, తల్లిపాల ప్రాముఖ్యాన్ని వివరించేందుకే ఇలా వినూత్న రీతిలో ప్రచారం చేశామని తెలిపారు.
చైనాలోని హార్బిన్ నగరంలో జరిగిన ఈ ప్రదర్శనలో.. పిల్లలున్న పురుషులంతా ఒకే చోట చేరి ఈవిధంగా ప్రచారం చేశారు. పని ఒత్తిడితో చైనాలోని చాలామంది తల్లులు పిల్లలకు పాలివ్వలేకపోతున్నారని, ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో పిల్లలపై ఆ ప్రభావం పడుతోందని, ఈ సమస్యను అధిగమించడానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామన్నారు ప్రదర్శనలో పాల్గొన్న పురుషులు.
చైనాలో పిల్లలకు పాలిస్తున్న తల్లుల సంఖ్య ప్రస్తుతం 16 శాతంగా మాత్రమే ఉంది. అదే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. సగటున పిల్లలకు పాలిస్తున్న తల్లుల సంఖ్య 40 శాతంగా ఉంది. దీంతో తల్లి పాలతో పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ తరహా ప్రదర్శన నిర్వహించారు అక్కడి తండ్రులు.