ఈమె కహానీ ఏంటో తెలుసుకోండి: ఇరాన్లో గూఢచర్యానికి వెళ్లి అమెరికాపైనే....
వాషింగ్టన్: అమెరికాలో ఇంటెలిజెన్స్ అధికారిణిగా అత్యున్నత హోదాలో పనిచేసిన మోనికా విట్ అనే మహిళ ఇరాన్కు వెళ్లి అక్కడి నుంచి అమెరికాపై గూఢచర్యం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. 2012లో ఇరాన్కు పారిపోయిన మోనికా విట్... ఇక అప్పటి నుంచి అమెరికా రహస్యాలను చేరవేస్తున్నట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి.
గూఢాచర్యం కోసం వెళ్లి...ప్రసంగాలకు ఆకర్షితురాలైంది
అమెరికా ఎయిర్ఫోర్స్ విభాగంలో 1997 నుంచి 2008వరకు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారిణిగా పనిచేసిన 39 ఏళ్ల మోనికా విట్ మధ్యప్రాచ్య దేశాల్లో మంచి పట్టు సాధించింది. తను పనిచేసిన కాలమంతా ఆమెను అమెరికా మిలటరీ అధికారులు మధ్యప్రాచ్య దేశాల్లోనే ఆఫీసర్గా వేశారు. ఆ సమయంలో ఆయాదేశాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించాల్సిందిగా పురుమాయించారు.
ఇక ఇస్లామ్ మతం గురించి దానివెనక ఉన్న ఉద్దేశం గురించి ప్రపంచదేశాలకు ఎలా విస్తరించాలనేదానిపై న్యూహారిజాన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ సమావేశం నిర్వహించింది. అయితే ఆ సమావేశానికి మోనికా విట్ను కూడా హాజరుకమ్మన్నారు. ఆ సమావేశానికి ఎవరెవరు ముఖ్య నాయకులు హాజరవుతున్నారో అక్కడే ఉన్న మోనికా అమెరికా వర్గాలకు సమాచారం చేరవేయాల్సిందిగా పురమాయించారు. అలా ఆ సమావేశానికి హాజరైన మోనికా విట్... అక్కడి ఇస్లాం ప్రసంగాలకు ఆకర్షితురాలైందని అమెరికా ఆరోపిస్తోంది. అనంతరం ఆమె అమెరికాను 2008లో వీడి మధ్యాసియా దేశాల్లో సెటిల్ అయ్యింది. అనంతరం అఫ్గానిస్తాన్, తజకిస్తాన్ దేశాల్లో ఇంగ్లీషు బోధిస్తూ అక్కడే ఉండిపోయింది.
సహోద్యోగుల కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేసింది
ఇక అక్కడి నుంచి ఒక్కసారిగా కనిపించకుండా పోయిన మోనికా విట్... 2013లో ఇరాన్ టీవీల్లో ప్రత్యక్షమైంది. అమెరికా రహస్యాలన్నీ చేరవేస్తూ షియా ఇస్లాంకు ప్రతినిధిగా మారింది. అమెరికాను వీడి ఇరాన్కు వచ్చిన తర్వాత మోనికా విట్ తను పనిచేస్తున్న సమయంలో కౌంటర్ ఇంటెలిజెన్స్లో పనిచేసే ఆమె సహోద్యోగుల వివరాల కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేసిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు. ఆ తర్వాత వారి వివరాలను ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాల వారికి ఇచ్చిందని ఎఫ్బీఐ పేర్కొంది. ఈ వివరాలతో ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు అమెరికా ప్రస్తుత ఇంటెలిజెన్స్ వర్గాల వారిని, మాజీ అధికారులను లక్ష్యంగా పలు ఆపరేషన్లు నిర్వహించాయి.
మోనికా విట్ ఇతర ఇరాన్ అధికారులపై క్రిమినల్ కేసులు
బుధవారం వాషింగ్టన్లో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఎఫ్బీఐ అధికారులు మోనికా విట్పై, న్యూహారిజాన్ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు ఎఫ్బీఐ అధికారులు వెల్లడించారు. గూఢచర్యం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఇరాన్ నుంచి నెట్ పెగార్డ్ సమావత్ కంపెనీకి చెందిన ఉద్యోగులపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మోనికా విట్ అందించిన సమాచారం ఆధారం చేసుకుని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్స్ నిర్వహించారని ఎఫ్బీఐ పేర్కొంది. ఇదిలా ఉంటే మోనికా విట్ మాత్రం ఇరాన్లోనే ఉన్నట్లు అమెరికా అధికారులు స్పష్టం చేశారు.