ప్రపంచానికి మరో కొత్త వ్యాధి భయం: ఆ ఐదు దేశాల్లో ముఖ్యంగా..అప్రమత్తం అంటున్న అమెరికా
ఇప్పటికే ప్రపంచం కరోనాతో విలవిలలాడుతుంటే, మరో కొత్త వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ముఖ్యంగా ఐదు దేశాల్లో ప్రస్తుతం ఆ వ్యాధి ప్రబలుతున్న ట్లుగా ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీంతో కరోనాతో పాటుగా, ఇప్పుడు మరో వ్యాధి టెన్షన్ ప్రపంచానికి పట్టుకుంది.
కరోనాతో కల్లోలం అవుతుంటే మరో కొత్త వ్యాధి విస్తరణ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుంది .ముఖ్యంగా అమెరికాను కకావికలం చేస్తుంది. అమెరికాలో అన్ని ప్రాంతాలు కరోనా హాట్ స్పాట్ గా మారుతున్న పరిస్థితి అగ్ర దేశానికి ఇబ్బందికరంగా తయారైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను సైతం కరోనా చిన్నాభిన్నం చేసింది. కరోనా నుండి బయటపడడం కోసం అమెరికా మాత్రమే కాకుండా, ప్రపంచ దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తయారీలో పోటీపడి మరీ నిమగ్నమయ్యాయి ఇక ఇదే సమయంలో మరో కొత్త వ్యాధి పేరు తెర మీదకు వచ్చింది.
కరోనాతో పాటుగా మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే వ్యాధి ... పిల్లల్లో ఎఫెక్ట్
అమెరికాలో కరోనాతో పాటుగా మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే వ్యాధి విజృంభిస్తున్న ట్లుగా గుర్తించారు. అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ మరియు చర్యల సంస్థ ముఖ్యంగా పిల్లల్లో మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే కొత్త వ్యాధి వస్తున్నట్లుగా గుర్తించిన సంస్థ ఈ వ్యాధితో పిల్లల్లో జ్వరం, శరీరంపై దద్దుర్లు, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయని, జ్వరం తో మొదలయ్యే ఈ వ్యాధి తరువాత శరీరంలోని మిగతా భాగాలని డామేజ్ చేస్తుందని పేర్కొంది.
అమెరికాలో కరోనా సోకిన 600మంది పిల్లలకు మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్
కరోనా వైరస్ సోకిన పిల్లల్లో ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లుగా గుర్తించిన సంస్థ, ఒక్క అమెరికాలోనే కాకుండా ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ లలో కూడా ఈ వ్యాధి విస్తరిస్తున్నట్లుగా పేర్కొంది. అమెరికాలో ఇప్పటివరకు గత నాలుగు నెలల్లో కరోనా సోకిన 600 మంది పిల్లలకు ఈ వ్యాధి సోకినట్లుగా పేర్కొన్న సంస్థ ఈ వ్యాధి కారణంగా 10 మంది చిన్నారులు మృతి చెందినట్లుగా తెలిపింది.
పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త .. హెచ్చరిస్తున్న అమెరికాలోని సీడీసీ సంస్థ
తీవ్రమైన COVID-19 మరియు ఇతర హైపర్ ఇన్ఫ్లమేటరీ పరిస్థితుల నుండి మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ రోగులను వేరుచేసి , ప్రారంభ రోగ నిర్ధారణతో పాటు సత్వర చికిత్సఅందించాలని సంస్థ వెల్లడించింది . ఈ విషయంలో ఎక్కువ అవగాహన అవసరం అని సిడిసి పేర్కొంది. దీంతో అమెరికా ఒక కరోనాతో మాత్రమే కాకుండా, మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ తో కూడా జాగ్రత్తగా ఉండాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరిస్తోంది.