ఇలా ఇంకెవరూ చేసి ఉండరేమో?: ఆమె 'సెల్ఫీ' గురించి ప్రపంచం మాట్లాడుకుంటోంది..
వేధింపులకు పాల్పడ్డవారితోనే సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయడం మొదలుపెట్టింది.
ఆమ్స్టర్డామ్: ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టింది మొదలు.. తిరిగి ఇంటికొచ్చేదాకా మహిళలకు భద్రత కరువైపోయింది. రోడ్డుపై నడుస్తున్నా.. బస్ స్టాప్లో నిలుచుకున్నా.. ఎక్కడికెళ్లినా.. ఏం చేసినా.. ఆకతాయిల వేధింపులు అడుగడుగునా ఎదురవుతూనే ఉంటాయి.
ఇలాంటి వేధింపులు తాళలేక చాలామంది మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే జంకే పరిస్థితి. కానీ ఆమ్స్టర్డామ్ కు చెందిన ఓ అమ్మాయి మాత్రం ఈ వేధింపులకు వినూత్న రీతిలో చెక్ పెట్టాలని భావించింది. వేధించినవాళ్లతోనే సెల్ఫీ తీసుకుని, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా వాళ్లకు బుద్ది చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
నోవా జన్స్:
నోవా జన్స్ అనే యువతి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆమ్స్టర్డామ్ లో విద్యను అభ్యసిస్తున్న నోవా.. నిత్యం వేధింపులను చవిచూస్తూనే ఉంది. కాలేజీకి వెళ్తున్నప్పుడు.. మరేదైనా పని మీద వెళ్తున్నప్పుడు.. ఆకతాయిల సూటిపోటి మాటలు ఆమెను గాయపరిచేవి. దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనలో నుంచే సెల్ఫీ ఐడియా పుట్టింది.
నెల రోజుల్లో 30మందితో
తనను కామెంట్ చేసిన, టీజ్ చేసిన ఆకతాయిలతో సెల్ఫీ దిగి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడం మొదలుపెట్టింది. అలా నెల రోజుల వ్యవధిలో తనను వేధించిన 30 మందితో ఫోటోలు దిగి వాటిని అప్ లోడ్ చేసింది. సోషల్ మీడియాలో చాలామంది నెటిజెన్లను ఆమె సెల్ఫీలు ఆకర్షించాయి. దీంతో రోజుల వ్యవధిలోనే ఆమెకు 45 వేల మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు.
ఒకరకంగా నిరసనే:
వేధించిన ఆకతాయిలతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టడమంటే ఒకరకంగా తన నిరసనను వ్యక్తం చేయడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆకతాయిలకు భయపడకుండా.. వారికి బుద్ది వచ్చేలా ఆమె చేస్తున్న పనికి చాలామంది అభినందిస్తున్నారు. తన లాగే వేధింపులు ఎదుర్కొంటున్న మరెవరైనా తన సోషల్ మీడియా ఖాతాను ఉపయోగించుకోవచ్చునని ఆమె చెబుతున్నారు.
ఎందుకీ ఆలోచన:
మహిళల రోజువారీ దినచర్యలపై పురుషులకు మరింత అవగాహన తెచ్చేందుకే తాను ఈ ప్రాజెక్టును చేపట్టానని చెప్పుకొచ్చింది నోవా. తాను రైల్లో ప్రయాణిస్తున్న వేళ, తొలిసారి వేధింపులు ఎదురయ్యాయని, ఆపై ఈ ఆలోచన చేశానని డచ్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తనను వేధించిన ఆకతాయిలతో సెల్ఫీలు మొదలుపెట్టాక.. కేవలం ఒక్క యువకుడు మాత్రమే సెల్ఫీ ఎందుకని ప్రశ్నించాడట. ఆమ్ స్టర్ డామ్ లో వేధింపులకు పాల్పడితే 190 ఫ్రాంక్స్ (రూ. 14 వేలు) జరిమానా ఉంటుందని నోవా చెబుతోంది. తన సెల్ఫీల గురించి తెలిసిన తర్వాత చాలామంది తనను వేధించడానికి వెనక్కి తగ్గుతున్నారని తెలిపింది.