ట్రంప్ కు షాక్! మళ్లీ ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులు నిలిపివేత, ఆందోళనలో వైట్ హౌస్
ట్రంప్ యంత్రాంగం పలు ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్కు మళ్లీ చుక్కెదురైంది.
వాషింగ్టన్: ట్రంప్ యంత్రాంగం పలు ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్కు మళ్లీ చుక్కెదురైంది. తొలి రెండు నోటిపికేషన్లను నిలిపివేసిన తరహాలోనే మూడోసారి ఇచ్చిన ఉత్తర్వులను కూడా హవాయి ఫెడరల్ జడ్జ్ బ్లాక్ చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వులు జాతీయత ఆధారంగా వివక్షకు గురిచేసేలా ఉన్నాయని ఫెడరల్ జడ్జి పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన 40 పేజీల రూలింగ్ ట్రంప్ ప్రభుత్వంలో కలకలం రేపింది.
గత ఉత్తర్వుల మాదిరే బుధవారం నుంచి అమల్లోకి రానున్న తాజా ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులు దేశ ప్రయోజనాలకు విరుద్ధమని, ఆరు నిర్థిష్ట దేశాల నుంచి వలసలను నిరోధించడం అమెరికా ప్రయోజనాలకు భంగకరమని జడ్జి డెర్రిక్ వాట్సన్ వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది జనవరి, మార్చిలో ట్రంప్ విధించిన రెండు ట్రావెల్ బ్యాన్లకు పలు కోర్టుల్లో చుక్కెదురవగా, జూన్ చివరిలో కొద్దిపాటి మార్పులతో రెండో బ్యాన్ ఉత్తర్వుల పాక్షిక అమలుకు సుప్రీం కోర్టు అనుమతించింది.
అది కూడా గత నెలలో ముగియడంతో ఈసారి మరికొన్ని దేశాలను జోడిస్తూ మూడో ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులను ట్రంప్ యంత్రాంగం ఇటీవలే రూపొందించి చట్టంగా మార్చింది.
వైట్ హౌస్ ఆందోళన...
ఫెడరల్ కోర్టు జస్టిస్ వాట్సన్ రూలింగ్ ప్రమాదకరమని, ఆయన జారీ చేసిన ఉత్తర్వులు జాతి భద్రతకు ముప్పని వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది. హోంల్యాండ్ సెక్యూరిటీ, రక్షణ, న్యాయ శాఖాధికారులు విస్తృతంగా చర్చించిన మీదట తాజాగా ట్రావెల్ బ్యాన్ను పకడ్బందీగా రూపొందించామని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. తాజా నియంత్రణలు అమెరికా వలస వ్యవస్థ, దేశ భద్రతకు కనీస భద్రతా ప్రమాణాలని వైట్ హౌస్ వ్యాఖ్యానించింది.