ట్రంప్కు ఫెడరల్ కోర్టు షాక్: ముస్లిం దేశాల నిషేధంపై 'స్టే'
ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలసదారుల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ.. వీసా ఆర్డర్స్ ను నిలిపేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
వాషింగ్టన్: ఏడు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిషేధం విధించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్.. ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు ట్రంప్ కు షాక్ ఇచ్చింది.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలసదారుల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ.. వీసా ఆర్డర్స్ ను నిలిపేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీనిపై కోర్టు జారీ చేసిన ఇంజక్షన్ ఆర్డర్ దేశవ్యాప్తంగా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అమెరికా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ ఎల్ రాబర్ట్ ఈ తీర్పు వెలువరించారు.
కోర్టు తీర్పుపై అటర్నీ జనరల్ ఫెర్గూసన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో రాజ్యాంగం విజయం సాధించిందని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతం కాదనేది దీనితో స్పష్టమైందన్నారు. వాషింగ్టన్ రాష్ట్రం దీనిపై పిటిషన్ దాఖలు చేసిన అనంతరం.. మిన్నెసోటా కూడా ట్రంప్ నిషేధాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.
ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కోర్టులో అమెరికా పౌర హక్కుల నేతలు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. ట్రంప్ నిర్ణయంపై తాత్కాలిక నిలుపుదల విధించింది.