ఫిఫా కప్: ఫైనల్ చూడ్డానికి రావాలని మోడీకి బ్రెజిల్
న్యూఢిల్లీ: ఫిఫా ప్రపంచ కప్ 2014 ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి రావాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బ్రెజిల్ దేశ అధ్యక్షులు దిల్మా రౌసెఫ్ ఆహ్వానించారు. ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు బ్రెజిల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఫిఫా ప్రపంచ కప్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఫిఫా ప్రపంచకప్కు విశేష ఆదరణ ఉంది. మన దేశంలోను పశ్చిమ బెంగాల్ తదితర ఉత్తరాది ప్రాంతాల్లో ఆదరణ ఉంది. ఈ ఫిఫా ఫుట్బాల్ పోటీలు చూసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా... బ్రెజిల్ అధ్యక్షులు దిల్మా రౌసెఫ్ భారత ప్రధాని మోడీకి ఫైనల్ మ్యాచ్కు రావాలని స్వయంగా ఆహ్వానించారు. జూలై 13వ తేదీన రియో డి జెనరియోలోని ఎస్టాడియా మరకానాలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు రావాలని ఆయన మోడీని ఆహ్వానించారు.
ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రష్యా అధ్యక్షులు వ్లాదిమర్ పుతిన్, చైనా అధ్యక్షులు జిన్ పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు జాకోబ్ జుమా తదితరులు వస్తున్నారు. హాజరు కావాలా లేదా అని మోడీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జూలై 15 నుండి 17 వరకు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ కప్ జూలై 13న జరగనుంది. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో మోడీ రెండు రోజుల ముందు వెళ్లి ఫైనల్ చూస్తారా అనేది చూడాలి.