విచిత్రం: మూడేళ్లుగా కొబ్టరి చెట్టుపైనే.. దిగితే చంపేస్తారంటాడు! చివరికి...
ఫిలిప్పీన్స్లో ఓ వ్యక్తి అనవసర భయాందోళనకు గురయ్యాడు. తనను ఎవరో చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తన ఇంటికి సమీపంలోని కొబ్బరిచెట్టు ఎక్కేశాడు. అలా కొబ్బరిచెట్టు ఎక్కిన అతడు.. ఏకంగా మూడేళ్ల పాటు చెట్టుపైన
మనీలా: ఫిలిప్పీన్స్లో ఓ వ్యక్తి అనవసర భయాందోళనకు గురయ్యాడు. తనను ఎవరో చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తన ఇంటికి సమీపంలోని కొబ్బరిచెట్టు ఎక్కేశాడు. అలా కొబ్బరిచెట్టు ఎక్కిన అతడు.. ఏకంగా మూడేళ్ల పాటు చెట్టుపైనే గడిపాడు.
చివరికి అతడి ఉదంతం సోషల్ మీడియా ద్వారా లోకమంతటికీ తెలియడంతో అతడ్ని చెట్టుమీదనుంచి కిందికి దింపడానికి అక్కడి ప్రభుత్వం 50 మందితో కూడిన రెస్క్యూ టీంను పంపించి దింపించింది.
వివరాల్లోకి వెళితే... ఫిలిప్పీన్స్లోని అగుసాన్ డెల్ సర్ ప్రావిన్స్.. లాపాజ్కు చెందిన గిల్బెర్ట్ సాంచెజ్(47) మూడేళ్ల క్రితం తన ఇంటికి సమీపంలో ఉన్న 60 అడుగుల కొబ్బరిచెట్టు ఎక్కాడు. 2014లో చెట్టుపైకి ఎక్కిన ఆయన.. కొద్దిరోజుల క్రితం వరకు కిందికి దిగలేదు.
మూడేళ్లకు పైగా అదే చెట్టుపై గడిపాడు. వృద్ధురాలైన అతని తల్లి సహా కుటుంబసభ్యులు ఎంతగా చెప్పినా కిందికి దిగలేదు. కిందికి వస్తే తనను ఎవరైనా చంపేస్తారంటూ విచిత్రంగా వాదించడం మొదలెట్టాడు.
ఆ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి గిల్బెర్ట్ తలపై తుపాకీతో కొట్టారని.. అప్పటి నుంచి అతడు ఈ విధంగా భయాందోళన చెందుతూ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని అతని తల్లి వినిఫ్రెడా తెలిపారు.
ఎన్నిసార్లు ప్రాధేయపడినా గిల్బెర్ట్ కిందికి రాకపోవడంతో చేసేదేమీలేక కుటుంబసభ్యులే రోజూ అతనికి చెట్టుపైకి ఆహారం అందించేవారు. ఓ తాడు సాయంతో ఆహారం, నీరు, సిగరెట్లు, దుస్తులను చెట్టుపైకి చేర్చేవారు. దాన్ని గిల్బెర్ట్ అందుకునేవాడు. ఈ విధంగా మూడేళ్లు గడిచిపోయాయి.
ఏళ్ల తరబడి చెట్టుపైనే ఉండిపోవడంతో అతనికి పలు రకాలు చర్మ వ్యాధులు సోకాయి. శరీరం నుంచి దుర్వాసన కూడా వచ్చేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా గిల్బెర్ట్ కిందికి దిగలేదు. అతని కుమార్తెలు సైతం ప్రాధేయపడినా పరిస్థితిలో మార్పు రాలేదు.
కిందికి దిగితే తనను ఎవరైనా చంపేస్తారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ దిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేవాడు. కనీసం స్నానం చేసేందుకైనా కిందికి రావాలని చెప్పినా వినిపించుకోలేదని అతని తల్లి వినిఫ్రెడా కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది.
గిల్బెర్ట్ తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో రోజురోజుకీ వారి కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. కుటుంబ పరిస్థితి దృష్ట్యా అతని కుమార్తెలు ఇద్దరూ పాఠశాలకి వెళ్లడం మానేశారు. ఆ ప్రాంతంలో గిల్బెర్ట్ పరిస్థితి గురించి కొంతమందికి తెలిసినా వారెవరూ అంతగా పట్టించుకోలేదు.
చివరికి సోషల్మీడియాలో ఈ విషయం వైరల్గా మారడంతో ఫిలిప్పీన్స్లోని మీడియా సంస్థలు దృష్టి సారించి కథనాలు ప్రసారం చేశాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం గిల్బెర్ట్ను చెట్టు నుంచి కిందికి దించే చర్యలను ప్రారంభించింది.
50 మందితో కూడిన రెస్క్యూ టీం అక్టోబర్ 11న అతన్ని సురక్షితంగా కొబ్బరిచెట్టు మీదనుంచి కిందికి దించింది. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం అతను కండరాల క్షీణత, వెన్నెముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.
ఈ విషయం సోషల్మీడియాలో వైరల్గా మారడంతో గిల్బెర్ట్ కుటుంబానికి సాయం అందించేందుకు అక్కడి ప్రజలు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు.