అమెరికాలో కల్లోలం: ట్రంప్ సంచలనం -ఇది ఆరంభం మాత్రమే -అధికార బదిలీకి అంగీకరిస్తూనే శపథం
ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామిక దేశంగా, మిగతా దేశాలకు పెద్దన్నగా కొనసాగుతోన్న అమెరికాలో అనూహ్య పరిస్థితులు తలెత్తాయి. అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ గెలుపును అంగీకరించబోని ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పదేపదే ప్రకటనలు చేయడంతో ఆయన ఫాలోవర్లు విధ్వంసానికి దిగారు. వాషింగ్టన్ డీసీలోని పార్లమెంట్ భవనం(కేపిటల్ బిల్డింగ్)లో సమావేశమైన అమెరికా కాంగ్రెస్.. బైడెన్ విజయాన్ని ఖరారుచేసే ప్రక్రియ చేపట్టగా ట్రంప్ అభిమానులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. తుపాకులు, బాంబుల మోతతో పార్లమెంట్ బిల్డింగ్ దద్దరిల్లింది. ఈ ఘటనపై అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇంత జరిగిన తర్వాతగానీ..
Recommended Video
బర్డ్ ఫ్లూ విలయం: చికెన్, గుడ్లు తింటున్నారా? -అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు
ఆకులు పట్టుకున్న ట్రంప్
అమెరికా చరిత్రలోనే తొలిసారిగా కేపిటల్ బిల్డింగ్ లో రక్తపాతం, హింస చోటుచేసుకుంది. తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజాస్వామిక దేవాలయం లాంటి పార్లమెంటుపై దాడిని పార్టీలకు అతీతంగా అమెరికన్లందరూ ఖండించారు. ఆఖరికి రిపబ్లికన్లు సైతం ట్రంప్ ను దనుమాడారు. దీంతో అధ్యక్షుడి అభిశంసనకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల్లో చిత్తుగా ఓడిన ట్రంప్ ను ఉన్నపళంగా పదవి నుంచి తొలగించే దిశగా ప్రయత్నాలు ఆరంభం కావడంతో తెంపరి నేత ఎట్టకేలకు ఆకులు పట్టుకున్నారు. తొలిసారి.. తాను పదవి నుంచి దిగిపోతానని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు..
అధికార బదిలీకి అంగీకారం..
గతేడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగ్గా, మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ బైడెన్ 306, ట్రంప్ 232 ఓట్లు సాధించడం, ఎన్నికల కమిషన్ సైతం డెమోక్రాట్లే విజయం సాధించారని ప్రకటించిన తర్వాత కూడా ఫలితాన్ని అంగీకరించడానికి ట్రంప్ నిరాకరిస్తూ వచ్చారు. బైడెన్ గెలుపునకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను చట్టసభ సభ్యులు ధృవీకరించే ప్రక్రియను కూడా ట్రంప్ వ్యతిరేకించారు. బుధవారం క్యాపిలట్ బిల్డింగ్ లో ఆ ప్రక్రియ కొనసాగుతోన్న సమయంలోనే ట్రంప్ మద్దతుదారులు బిల్డింగ్ పై దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనిని జాతిపై జరిగిన దాడిగా అందరూ చూస్తుండటంతో.. ఇప్పటిదాకా రెచ్చిపోయిన ప్రెసిడెంట్ ట్రంప్ దిగిరాక తప్పలేదు. జనవరి 20న జోబైడెన్ కు అధికారాలను బదిలీ చేస్తానని ట్రంప్ ఎట్టకేలకు అంగీకరించారు. కానీ..
ఎన్నికల ఫలితాన్ని అంగీకరించను..
కేపిటల్ బిల్డింగ్ పై ట్రంప్ అనుచరుల దాడి, హింస తర్వాత అమెరికాలో సీన్ పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా ట్రంప్ వైపు నిలవడ్డ ఆ కొద్ది మంది కాస్తా పదవులకు రాజీనామాలు చేసేశారు. రిపబ్లికన్ పార్టీ సైతం ట్రంప్ ను సమర్థించలేక డిఫెన్స్ లో పడిపోయింది. దేశ చరిత్రలో మాయని మచ్చలాంటి ఘటనకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్.. ఎట్టకేలకు అధికార మార్పిడికి అంగీకరించినప్పటికీ.. ఎన్నికల ఫలితాలతో మాత్రం ఎప్పటికీ విభేదిస్తానని చెప్పడం గమనార్హం. ''ఎన్నికల ఫలితాలతో నేను పూర్తిగా విభేదిస్తున్నప్పటికీ.. అసలు నిజాలేంటో, డెమోక్రాట్లు ఎలా గెలిచారో ముమ్మాటికీ నాకు తెలుసు. అయినాసరే, జనవరి 20న క్రమబద్ధమైన అధికార బదిలీ ఉంటుంది''అని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు..
ఇది ఆరంభం మాత్రమే..
ట్రంప్ అనుచరులు కేపిటల్ భవనాన్ని ముట్టడించి, హింసాత్మక దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ 52 మంది అరెస్టయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని దాదాపు అన్ని దేశాల అధినేతలు.. అమెరికాలో జరుగుతోన్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ మర్యాదగా అధికార బదిలీ చేపట్టాలని హితవుపలికారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడం, అభిశంసన కూడా తప్పదని అర్థమైన తర్వాత ట్రంప్ పదవి నుంచి దిగిపోతానని ప్రకటించారు. కానీ అమెరికాను మళ్లీ గొప్పగా చేసే(మేక్ అమెరికా గ్రేట్ అగైన్) పోరాటంలో ఇది(తన వెనుకడుగు) ఒక ఆరంభం మాత్రమేనని ట్రంప్ అన్నారు.
గొప్ప పాలన 4ఏళ్లకే ముగిసింది..
''అమెరికా చరిత్రలోనే అతి గొప్ప పరిపాలన తొలి టర్మ్ లోనే ముగియనుంది. ఈ క్షణానికి కూడా నేను ఎన్నికల ఫలితాలతో ఏకీభవించడంలేదు. చట్టబద్ధమైన ఓట్లు మాత్రమే లెక్కించాలన్న నా పోరాటాన్ని ఇకపైనా కొనసాగిస్తాను. మేక్ అమెరికా గ్రేట్ అగౌన్ పోరాటంలో ఇది ఆరంభం మాత్రమే'' అని ట్రంప్ శపథం చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ పోటీకి దిగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, రిపబ్లికన్ పార్టీ ఈసారి ఆయనకు అవకాశం ఇస్తుందా లేదా అనేది అనుమానమే. బుధవారం నాటి 'కేపిటల్ భవనంపై దాడి' ఘటనకు ట్రంప్ ను బాధ్యుడిగా చేస్తూ శిక్షించే దిశగానూ అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికి నెలల హైడ్రామా తర్వాతగానీ అధికార మార్పిడికి ట్రంప్ అంగీకరించారు.
తండ్రి అక్రమ సంబంధంతో కూతుళ్ల విరక్తి -భర్తను రూ.1.5కోట్లకు అమ్మేసిన భార్య -ప్రేయసికి షాక్