లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ పని ఫినిష్: ఎఫ్ఐఆర్, పాక్ మంత్రి
లాహోర్: ముంబై మారణకాండ కీలక సూత్రదారి, ఎష్కర్-ఏ-తోయిబా చీఫ్, జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పాక్ కు చెందిన సీనియర్ మంత్రి ఖుర్రం దస్తగిర్ బుధవారం స్థానిక మీడియాకు చెప్పారు. అయితే ఉగ్రవాద సంస్థ నాయకుడి మీద ఏ కేసు నమోదు చేస్తారు అనే విషయం ఆయన స్పష్టం చెయ్యలేదు.
హఫీజ్ సయీద్ మీద ఉన్న ఆరోపణలు పరిగణలోకి తీసుకుని అతని మీద చర్యలు తీసుకుంటామని పాక్ మంత్రి చెప్పారు. ఇప్పటికే పాక్ ప్రభుత్వం హఫీజ్ ను హౌస్ అరెస్టు చేసిందని గుర్తు చేశారు. హఫీజ్ సయీద్ మీద ఏ కేసు నమోదు చేస్తామో త్వరలో మీడియాకు చెబుతామని మంత్రి ఖుర్రం దస్తగిర్ అన్నారు.
ట్రంప్ దెబ్బకు పాక్ దెయ్యం దిగింది: హఫీజ్ సయీద్ నిర్భంధం
త్వరలోనే జమాత్ ఉద్ దవా సంస్థకు, ఫలాహ ఇన్సాన్ యత్ (ఎఫ్ఈఎఫ్) సంస్థకు చెందిన కార్యకర్తలను కూడా అరెస్టు చేస్తామని పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ న్యాయశాఖా మంత్రి రాణా సనావుల్లా మీడియాకు చెప్పారు. ఇప్పటికే పాక్ ప్రభుత్వం వారందరి మీద నిఘా పెట్టిందని అన్నారు.
ఈ రెండు సంస్థల నాయకులు, కార్యకర్తల మీద యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద అరెస్టు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే జాతీయ అవసరాల విషయంలో పాక్ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిలో రాజీపడదని తేల్చి చెప్పారు. కాశ్మీర్ విషయంలో ఇప్పటికే తమ విధానం చెప్పామని అన్నారు.
అయితే జమాత్ ఉద్ దవా సంస్థకు, కశ్మీర్ కు ఎలాంటి సంబంధం లేదని, అవి వేర్వేరు విషయాలని న్యాయశాఖా మంత్రి రాణా సనావుల్లా స్పష్టం చేశారు. హఫీజ్ సయీద్ హౌస్ అరెస్టు కావడంతో ఆ సంస్థలోని నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు వచ్చి చీలిపోయారని స్థానిక మీడియా అంటున్నది.