ప్యారిస్ దాడి మా పనే: అల్ఖైదా, హాట్ కేకుల్లో చార్లీ హెబ్డో, 15ని.ల్లో..
ప్యారిస్: చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయం పైన దాడి చేసింది తామేనని అల్ ఖైదా ప్రకటించింది. గత వారం చార్లో హెబ్డో పత్రిక కార్యాలయం పైన జరిగిన దాడిలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ దాడి చేసింది తామేనని అల్ ఖైదా ప్రకటించింది. ఈ దాడికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు హతమార్చారు.
చార్లీ హెబ్డో గిరాకీ
చార్లీ హెబ్డో మునుపెన్నడూ లేని రీతిలో కొత్త సంచికను 50 లక్షల ప్రతులతో విడుదల చేయలని నిర్ణయించింది. తొలుత 30 లక్షలు అనుకుంది. కొత్త సంచిక బుధవారం విడుదలైంది. చార్లీ హెబ్డోకు కార్యాలయ స్థలాన్ని సమకూర్చిన లిబరేషన్ వార్త పత్రిక ఈ విషయాన్ని విడుదలకు ముందు చెప్పింది.
కొత్త సంచిక ముఖచిత్రం ఛాయాచిత్రాన్ని పోస్ట్ చేసింది. సాధారణంగా అరవై వేల ప్రతులతో నడిచే ఈ పత్రికకు డిమాండుకు బాగా పెరగడంతో జనవరి 14 సంచికను 50 లక్షల ప్రతులకు పెంచింది. కాగా, ఈ పత్రిక బుధవారం విడుదల కాగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
పుస్తకాల దుకాణాలు తెరవకముందే భారీ ఎత్తున ప్రజలు క్యూలో నిలబడ్డారట. తాను షాప్ తెరవకముందే దాదాపు అరవై, డెబ్బై మంది వరుసలో నిలబడ్డారని కియోస్క్లోని ఓ పుస్తక యజమానురాలు తెలిపారు. తాను తీసుకు వచ్చిన 450 పుస్తకాలు పదిహేను నిమిషాల్లో అమ్ముడుపోయాయని తెలిపారు. ఇది ఆశ్చర్యకరమన్నారు.
కాగా, ఫ్రెంచ్ వారపత్రిక చార్లీ హెబ్డో కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన అమానుషమైన దాడినుంచి ఫ్రాన్స్ ఇంకా పూర్తిగా తేరుకోకముందే మంగళవారం తాజాగా మరోసారి ఆ దేశానికి ఉగ్రవాదులనుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఉత్తర ఆఫ్రికాలోని అల్ఖైదా సంస్థ అయిన అల్ఖైదా ఇన్ ఇస్లామిక్ మెఘ్రెబ్ (ఎక్యుఐఎం) అనే సంస్థ ఈ బెదిరింపులు చేసింది.
చార్లీహెబ్డో పత్రికపై జరిగిన దాడిని ఉత్తర ఆఫ్రికాలోని అల్ఖైదా శాఖ ఎక్యుఐఎం ప్రశంసిస్తూ గత బుధవారం ఆ పత్రిక కార్యాలయంపై దాడి చేసి 12 మంది సిబ్బందిని హతమార్చిన కౌచి సోదరులను ఆదర్శంగా తీసుకోవాలని ముస్లింలకు పిలుపునిచ్చినట్లు ఫ్రాన్స్ నిఘా సంస్థ ‘సైట్' తన ట్విట్టర్లో పేర్కొంది.
ముస్లిం దేశాలపై ఫ్రాన్స్ దాడులు చేస్తోందని ఆ సంస్థ ఆరోపిస్తూ ఇరాక్, సిరియాలలో ముస్లిం ప్రజలపై ఫ్రాన్స్ బాంబు దాడులు కొనసాగించినంతకాలం ఆ దేశంపై ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు సిఎన్ఎన్ పేర్కొంది.
బుధవారం చార్లీ హెబ్డో తాజా సంచిక మార్కెట్లో విడుదల కావడానికి ఒకరోజు ముందు ఈ తాజా బెదిరింపు రావడం గమనార్హం. గత బుధవారం జరిగిన భయానక దాడిలో పత్రికకు చెందిన 8 మంది కార్టూనిస్టులు మృతి చెందినప్పటికీ ఆ పత్రిక ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా, తాజా సంచికలో మహమ్మదు ప్రవక్త క్యారికేచర్ను ప్రచురించాలని నిర్ణయించింది.
మామూలుగా ఆ మ్యాగజైన్ ప్రతివారం 60 వేల ప్రతులను ముద్రించేది. అయితే దేశం నలుమూలల నుంచి వచ్చిన భారీ డిమాండ్ కారణంగా ఈసారి ఏకంగా లక్షల కాపీలను ముద్రించింది. మొత్తం 16 భాషల్లో ఈ మ్యాగజైన్ ప్రచురితమవుతోంది.