అమెరికా అధ్యక్షుడి ఇంట్లో కరోనా బాంబు.. న్యూయార్క్ లాక్డౌన్.. దేశమంతటా విస్తరించిన వైరస్..
భూమిమీద అత్యంత శక్తిమంతమైన, శత్రుదుర్భేద్యమైన చోటు.. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్హౌజ్లో కరోనా బాంబు పేలింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబం, ఫెడరల్ ప్రభుత్వ కీలక మంత్రులు, అధికారులు నిత్యం వచ్చిపోయే చోట వైరస్ వెలుగుచూడటం సంచలనంగా మారింది. అధ్యక్ష భవనంలో పని చేస్తోన్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు సాక్ష్యాత్తూ వైట్ హౌస్ అధికారిక ప్రతినిధి క్యాథీ మిల్లర్ మీడియాకు తెలిపారు.
చైనా కుట్ర..
అగ్రరాజ్యం అమెరికాలో తీవ్రంగా ప్రభావం చూపుతోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే 258 మందిని బలి తీసుకోగా, 18,763 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలతోపాటు భారీ ఆర్థిక ప్యాకేజీలు కూడా సిద్ధం చేసిన డొనాల్డ్ ట్రంప్.. వాటిని ప్రకటిస్తూ.. కరోనా పాపం చైనాదేనని, ఆ మహమ్మారిని తాను చైనా వైరస్ గానే గుర్తిస్తానని చెప్పారు. వైట్ హౌజ్ లో కరోనా పాజిటివ్ వ్యక్తిని గుర్తించడంతో ప్రెసిడెంట్ కు కూడా వైరస్ సోకిఉంటుందేమోననే అనుమానాలు పెరిగాయి. అయితే..
ట్రంప్ కు టెస్టులు..
కరోనా సోకిన సదరు ఉద్యోగి.. వైస్ ప్రెసిడెంట్ మైక్ పేన్స్ ఆఫీసులో పనిచేస్తున్నాడని, ఇటీవలి కాలంలో అతను వైస్ ప్రెసిడెంట్ నుగానీ, ప్రెసిడెంట్ ట్రంప్ ను గానీ నేరుగా కలవనేలేదని, ప్రస్తుతం ఆయనను ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని క్యాథి తెలిపారు. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతానికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లకు, వారి కుటుంబాలకు వచ్చిన ముప్పేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్.. ఐదు రోజుల కిందటే కరోనా టెస్టులు చేయించుకోవడం, ఫలితాలు నెగటివ్ రావడం తెలిసిందే.
ఆర్థిక రాజధాని మూసివేత..
కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రపంచ టెక్ రాజధాని కాలిఫోర్నియాను అధికారులు గురువారం నుంచి లాక్ డౌన్ చేశారు. ఆ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే దేశ ఆర్థిక రాజధాని న్యూయార్క్ రాష్ట్రాన్ని కూడా లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కూమో శుక్రవారం మీడియా ముందుకొచ్చి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. న్యూయార్క్ తోపాటు కనెక్టికట్, ఇల్లినాయిస్ రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నాలుగు రాష్ట్రాలూ మూతపడిన తర్వాత అమెరికా జనభాలోని ప్రతి ఐదుగురిలో ఒకరు నిర్బంధంలోకి వెళ్లినట్లయింది.
Recommended Video
అన్ని రాష్ట్రాలకూ పాకిన వైరస్..
శుక్రవారం నాటికి కరోనా మహమ్మారి అమెరికాలోని 50 రాష్ట్రాలకూ విస్తరించింది. అమెరికాకు పొరుగునే ఉన్న కొలంబియా, పోర్టోరికా, యూఎస్ వర్జిన్ దీవుల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అమెరికాలో ఇప్పటివరకు 18, 763 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 258 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా వాషింగ్టన్ స్టేట్ లో 82 మంది, న్యూయార్క్ లో 53 మంది, కాలిఫోర్నియాలో 24 మంది చనిపోయారు.