షటప్ మ్యాన్: ట్రంప్ ఫైర్: ఒబామా కేర్పై వాడివేడిగా ట్రంప్-బిడెన్ మధ్య డిబేట్: భారత్ ప్రస్తావన
వాషింగ్టన్: ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తిగా గమనిస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి డిబేట్ ప్రారంభమైంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి గద్దెనెక్కాలని భావిస్తోన్న డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ మధ్య వాడివాడిగా సాగింది. ఫాక్స్ న్యూస్ ప్రతినిధి క్రిస్ వాలెస్.. ఈ డిబేట్కు మోడరేట్గా వ్యవహరించారు. క్లీవ్ల్యాండ్లో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరయ్యారు.
ఎమీ బార్రెట్ నియామకంపై..
తొలి ప్రశ్నను డొనాల్డ్ ట్రంప్కు సంధించారు. ఎమీ కోనీ బార్రెట్ను సుప్రీంకోర్టుకు నామినేట్ చేయడాన్ని ప్రశ్నించారు మోడరేట్. రిపబ్లికన్ల సానుభూతిపరులు గుర్తింపు పొందిన బార్రెట్ను సుప్రీంకోర్టుకు నామినేట్ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయని చెప్పారు. దీనిపై ట్రంప్ బదులిచ్చారు. ఆమె న్యాయకోవిదురాలు అని చెప్పారు. దీనికి జో బిడెన్ కూడా సమ్మతించారు. న్యాయవ్యవస్థను తాను వ్యతిరేకించబోనని అన్నారు. బార్రెట్ వెరీ ఫైన్ పర్సన్.. అని జో బిడెన్ కితబునిచ్చారు.
ఒబామా హెల్త్కేర్..
రెండో ప్రశ్న ఒబామా కేర్పైకి మళ్లింది. దీనిపై చాలాసేపు వాడివేడిగా చర్చ జరిగింది. డొనాల్డ్ ట్రంప్ చెప్పే పలు సమాధానాలకు జో బిడెన్ నవ్వడం కనిపించింది. 100 మిలియన్ల మందికి ఒబామా కేర్ను అమలు చేస్తున్నామని ట్రంప్ చెప్పగా.. అంత లేదంటూ జో బిడెన్ అడ్డు పడ్డారు. 100 మిలియన్ల మందికి ఒబామా కేర్ను అమలు చేస్తే.. కరోనా వైరస్ వల్ల వారంతా ఎందుకు మరణిస్తారని అన్నారు. హెల్త్కేర్ వ్యవస్థ అస్తవ్యస్తమైందని బిడెన్ ఆరోపించారు.
భారత్లో ఎంతమంది చనిపోయారో తెలుసా?
ఈ సందర్భంగా జో బిడెన్ చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. `షటప్ మ్యాన్..` అంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్ బారిన పడి రెండు లక్షల మంది మరణించారని చెప్పారు. ఈ డిబేట్లో భారత ప్రస్తావన కూడా వచ్చింది. కరోనా మరణాలపై ట్రంప్ మాట్లాడుతూ.. కరోనా వల్ల భారత్లో ఎంతమంది మరణించారో తెలుసా? అని జో బిడెన్ను ప్రశ్నించారు. భారత్ సహా చైనా, రష్యా కరోనా మరణాలపై వాస్తవ లెక్కలను వెల్లడించట్లేదని చెప్పారు. డెమొక్రాట్ల ప్రభుత్వ హయాంలో స్వైన్ఫ్లూ బారిన పడి చాలా మంది మరణించారని, అప్పుడు వారేం చేశారని ప్రశ్నించారు. హెచ్1 ఎన్1 వైరస్కు ఎంతోమంది మరణించారని చెప్పారు.
మాస్క్ ధరించట్లేదనే ఆరోపణలపై..
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో మందుల ధరలను తగ్గించానని ట్రంప్ చెప్పారు. అన్ని రకాల మందుల ధరలను 80 నుంచి 90 శాతానికి తగ్గించానని అన్నారు. తాను మాస్క్ ధరించట్లేదనే ఆరోపణలను ట్రంప్ తప్పు పట్టారు. మాస్క్ ఎప్పుడూ తన వెంటే ఉంటుందని చెప్పారు. తన వెంట తెచ్చుకున్న మాస్క్ను ఆయన మోడరేట్కు చూపించారు. అవసరం ఉంటేనే మాస్క్ ధరిస్తానని అన్నారు. జో బిడెన్ తరహాలో తాను ప్రజలకు 200 మీటర్ల దూరంలో ఉండనని చురకలు అంటించారు. బిడెన్ అతిపెద్ద మాస్క్గా కనిపిస్తుంటారని ఎద్దేవా చేశారు.
Recommended Video
ట్రంప్కు ప్లానింగ్ లేదు..
కరోనా వైరస వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి డొనాల్డ్ ట్రంప్ వద్ద ఇప్పటికీ సరైన ప్రణాళిక లేదని జో బిడెన్ విమర్శించారు. వైరస్ నియంత్రణపై ఎలాంటి అవగాహన లేదని ఆరోపించారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో నామమాత్రంగా నిధులను వ్యయం చేశారని అన్నారు. ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి ట్రంప్ ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళికలు లేవని పునరుద్ఘాటించారు. ఇప్పుడు మేల్కొనకపోతే.. మరింత ప్రమాదం తప్పదని హెచ్చరించారు.