యూఎస్లో దారుణం: పగడీ ధరించిన తొలి సిక్కు పోలీస్ అధికారి కాల్చివేత
టెక్సాస్/న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన సిక్కు పోలీస్ అధికారిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అతడు అక్కడికకక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విచక్షణా రహితంగా కాల్పులు..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దాదాపు పదేళ్ల నుంచి హారీస్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు సందీప్ సింగ్ ధలీవాల్(40). కాగా, శుక్రవారం అర్ధరాత్రి స్థానికంగా ట్రాఫిక్ విధులను నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా ఓ కారును ఆపి తనిఖీ చేస్తుండగా.. కారులోంచి ఓ దుండగుడు బయటకు వ్చి సందీప్పై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు,.
పక్కా ప్రణాళికతోనే...?
వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు.. వెంబడించి కారులో మహిళతోపాటు ఉన్న నిందితుడ్ని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే.. సందీప్ను పక్కా ప్రణాళిక ప్రకారమే కాల్పులు జరిపి చంపినట్లు తెలుస్తోందని షెరీఫ్ ఈడీ గొంజాలెజ్ వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు రాబర్ట్ సొలిస్ని విచారిస్తున్నట్లు తెలిపారు.
సింగ్ సేవలు మరువలేం
సందీప్ సింగ్ ధలీవాల్ గొప్ప పోలీస్ ఆఫీసర్ అంటూ గొంజాలెజ్ ప్రశంసించారు. షెరీఫ్కు తొలి సిక్కు డిప్యూటీ సందీప్ అని తెలిపారు. 2015 నుంచి గడ్డం, తలపాగాతో రోడ్లపై అతడు విధులు నిర్వర్తుస్తుంటే.. స్థానిక సిక్కు యువకులు హారీస్ కౌంటీ షెరీఫ్లో చేరారని గుర్తు చేశారు. అంతేగాక, హరికేన్ సమయంలో ఎంతో సాహసోపేతంగా స్వయంగా ట్రక్కు నడుపుకుంటూ వెళ్లి బాధితులకు నిత్యావసర వస్తువులు అందించారని కొనియాడారు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా..
కాగా, సందీప్ సింగ్కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా, సందీప్ సింగ్ ధలీవాల్ పోలీసు అధికారిగానే మంచి మానవతా వాదిగా కూడా పేరు తెచ్చుకున్నారు. సిక్కు మతానికి సంబంధించిన పలు ఆర్టికల్స్ ను సందీప్ రాశారు. సిక్కు యువత కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా అవసరమైన వారికి సాయం చేశారు. సందీప్ మృతి పట్ల సెనెటర్ జాన్ కార్నిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం హూస్టన్ నగరానికి తీరని లోటని అన్నారు.
తొలి సిక్కు అధికారిగా రికార్డ్
సందీప్ లాంటి మనిషి దూరం కావడంతో ఆయన కుటుంబంతోపాటు బంధువులు, స్నేహితులు కూడా విషాధంలో మునిగిపోయారు. సందీప్ సింగ్ ధలీవాల్ పగడీ(టర్బన్) ధరించి విధులు నిర్వహించిన తొలి అధికారిగా అమెరికాలో ఆయన రికార్డు సృష్టించారు. ఆయన ప్రజలతోనూ ముఖ్యంగా పిల్లలతో ఎంతో సరదాగా ఉండేవారు. ధలీవాల్ మరణవార్త హూస్టన్ పోలీస్ శాఖలోనూ, నగరవాసుల్లోనూ విషాదాన్ని నింపింది. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎష్ జైశంకర్ భారతీయ అమెరికన్ సందీప్ మరణ వార్త పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాము ఇటీవల హూస్టన్ నగరంలో పర్యటించామని, ఈ ఘటన తమను ఎంతో ఆవేదనకు గురిచేసిందని అన్నారు. సందీప్ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.