లక్ష రూపాయల ధర పలికిన చేప: స్పెషాలిటీ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
థాయ్ లాండ్ : మహా అయితే ఓ చేప రూ.1000వెయ్యి ధర దక్కించుకోవడం గురించి మనం వినుంటాం. కానీ థాయ్ లాండ్ లో ఓ చేప ఏకంగా 53,500 బాట్ (1,03,733 రూపాయల)ల ధర పలికి రికార్డుల్లోకి ఎక్కింది. కాగా, ఈ చేపకు ఇంత భారీ ధర పలకడానికి కారణం.. థాయ్ లాండ్ జాతీయ జెండా రంగును ఆ చేప పోలి ఉండడమే.
గతంలో ఇలాంటి చేపలను ఉత్పత్తి చేసినప్పటికీ.. ఇంత ఖచ్చితమైన రంగులో సత్ఫలితం రావడం ఇదే తొలిసారి. చేతితో రంగులద్దినట్టుగా సరైన ఖచ్చితత్వంతో కూడిన రంగులను కలిగి ఉంది ఈ చేప. ఫేస్ బుక్ వేదికగా గత నవంబర్ 6న 99 బాట్ ల ప్రారంభ ధరతో దీన్ని వేలానికి పెట్టగా.. నవంబర్ 9న ముగిసిన యాక్షన్ లో భారీ ధర దక్కించుకుంది.
ఈ చేప పెంపకందారుడైన కచెన్ వొరాచెయ్ సైతం ఇంత భారీ ధర పలుకుతుందని ఊహించలేకపోయాడట. వేలానికి పెట్టిన రెండో రోజే ఇది 10 వేల బాట్ లు పలికి, చివరకు 53,500 బాట్ లకు అమ్ముడుపోవడం పట్ల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.