మ్యాగీ నూడుల్స్: భారత్లో నిషేధం, అమెరికాలో క్లీన్చిట్
న్యూఢిల్లీ: భారత్లో నిషేధం ఎదుర్కొంటున్న మ్యాగీ నూడుల్స్కు అమెరికాలో ఊరట లభించింది. మ్యాగీ నూడుల్స్పై ఆ దేశంలో మ్యాగీపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. మ్యాగీ నూడుల్స్లో తమ ప్రజలకు హాని కలిగించే రీతిలో సీసం, ఇతర హానికారక రసాయనాలు లేవని యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్డీఏ) క్లీన్ చిట్ ఇచ్చింది.
మ్యాగీ నూడుల్స్లో అనుమతించిన స్థాయికన్నా మించి ఆరోగ్యానికి హాని చేసే సీసం లాంటి పదార్థాలున్నట్లు శాంపిల్స్ పరీక్షలో తేలడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో పలు రాష్ట్రాల్లో మ్యాగీపై బ్యాన్ విధించారు. దీంతో తమ న్యూడుల్స్ ప్రాడక్ట్లను నెస్లీ ఇండియా వెనక్కి తీసుకుంది.
ఈ వివాదంపై ముంబై కోర్టుల్లో విచారణ కూడా కొనసాగుతోంది. అయితే తమ ఉత్పత్తులు తినేందుకు సురక్షితమేనని మ్యాగీ వాదిస్తోంది. తాజా పరిశోధనలు కూడా మ్యాగీ సేఫేనని చెబుతున్నాయి. గోవా ఆహార భద్రతా శాఖ నుంచి వచ్చిన మ్యాగీ శాంపిల్స్ను మైసూర్ ల్యాబ్లో పరీక్షించి ధృవీకరించారు. మరోవైపు మ్యాగీపై జూన్ 5న విధించిన నిషేధంపై నెస్లీ ఇండియాకి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని కేంద్రీయ ఆహార భద్రతా పరిమాణాల సంస్థ ప్రకటించింది.
మ్యాగీ నూడుల్స్ విషయంలో నిజాలు దాచి, తప్పుడు వ్యాపార ప్రకటనలు ఇచ్చి జాతి ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించిందని ఆరోపిస్తూ, నెస్లే సంస్థపై రూ. 400 కోట్లకు దావా వేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఎంతమేరకు నష్ట పరిహారాన్ని కోరాలన్న విషయమై తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాగా, భారత కేంద్ర ప్రభుత్వం ఇలా ఓ సంస్థపై ప్రజల తరపున దావా వేయాలని భావించడం ఇదే మొదటిసారి.