2020లో అన్నీ విపత్తులే: భూమి వైపు దూసుకొస్తున్న ఐదు అత్యంత భారీ గ్రహశకలాలు: నాసా
రానున్న నాలుగు రోజుల్లో భూమికి అతి సమీపంలో ఐదు భారీ గ్రహశకలాలు వెళ్లనున్నట్లు ప్రముఖ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా ప్రకటించింది. ఇవి ప్రస్తుతం భూమికి 4.6 మిలియన్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్నాయని వెల్లడించింది. అంటే భూమికి 7.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జూన్ 8వ తేదీన 310 అడుగుల ఉన్న భారీ గ్రహశకలం భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని నాసా పేర్కొంది. గ్రహ శకలం భూమికి మధ్య దూరం 1,820,000 మైళ్లు ఉంటుందని పేర్కొంది.
Recommended Video
భారత్లో కరోనా తగ్గుముఖం పడుతోందంటూ నాసా పేరుతో వార్తలు..ఇందులో నిజమెంత..?
భూమికి దగ్గరగా గ్రహశకలాలు
ఇక 64 అడుగులు ఉన్న మరో గ్రహశకలం కూడా జూన్ 8వ తేదీనే భూమికి దగ్గరగా వస్తుందని ఇది భూమికి 761,000మైళ్లు వరకు వస్తుందని నాసా తెలిపింది. ఇదిలా ఉంటే జూన్ 10వ తేదీ అంటే బుధవారం రోజున 65 అడుగులు ఉన్న గ్రహశకలం భూమికి అత్యంత సమీపంలో ప్రయాణిస్తుందని నాసా వెల్లడించింది. ఇది భూమికి 4,120,000 మైళ్ల దూరంలో పయనిస్తుందని స్పష్టం చేసింది. ఇక జూన్ 11వ తేదీన 65 అడుగులు ఉన్న మరో గ్రహశకలం భూమికి 3,630,000 దూరంలో వెళుతుందని అంతరిక్ష పరిశోధనా కేంద్రం వెల్లడించింది. ఇక ఇదే రోజు మరో గ్రహశకలం 2,350,000 మైళ్ల దూరంలో ప్రయాణిస్తుంది. భూమికి చంద్రుడికి మధ్య సగటు దూరం 3,85,000 కిలోమీటర్లుగా ఉంది.
విడ్జెట్పై గ్రహశకలాలకు సంబంధించి వివరాలు
ఇక నాసా పరిశీలిస్తున్న ఈ భారీ గ్రహశకలాల కొలత, భూమికి అత్యంత దగ్గరగా ఉండే దూరం, గ్రహశకలంకు మరో గ్రహశకలంకు మద్య వ్యత్యాసం లాంటి అన్ని అంశాలను తన విడ్జెట్పై డిస్ల్పే చేస్తోంది. వెబ్సైట్పై కర్సర్ను కదిలించి ఒక గ్రహశకలం పై ఉంచితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కనిపించేలా నాసా రూపొందించింది. ఆ వెబ్సైట్ పై ఇచ్చిన తేదీపై క్లిక్ చేస్తే ఆరోజు ఏ గ్రహశకలం భూమికి దగ్గరగా వస్తుందో ఆ శకలానికి సంబంధించిన పూర్తి వివరాలు యూజర్కు కనిపిస్తాయి.
2020 ప్రథమార్థంలో అన్నీ విపత్తులే
ఈ ఏడాదిలో మొత్తం విపత్తులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముందుగా దట్టమైన అడవుల్లో మంటలు చెలరేగడం, ఆ తర్వాత కరోనావైరస్ మహమ్మారి, అనంతరం తుఫాన్లు, ఆ వెంటనే భూకంపాలు ఇప్పుడు తాజాగా భారీ గ్రహశకలాలు భూమి వైపు దూసుకురావడంతో 2020 సంవత్సరం ఒక విపత్తుల సంవత్సరంగా గుర్తింపు పొందింది. కొన్ని నెలలుగా గ్రహశకలాలు భూమికి దగ్గరగా వస్తున్నాయి. అందులో ఒకటి మాస్క్ ధరించినట్లుగా, భూమికి సమీపిస్తున్న సమయంలో భౌతిక దూరం పాటించాలని చెబుతున్నట్లుగా ఉందని నాసా వెల్లడించింది. ఇక ఈ నెలలో వరుసగా ఐదు గ్రహశకలాలు భూమికి దగ్గరగా ప్రయాణించనున్నాయి.