Modi-Biden Meet:ప్రధానితో జోకులు పేల్చిన అమెరికా అధ్యక్షుడు..నవ్వు ఆపుకోలేరు..!!
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శుక్రవారం భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ అయ్యారు. వాషింగ్టన్లోని శ్వేత సౌధం ఇందుకు వేదికగా నిలిచింది. మోదీ భారత సంప్రదాయం ఉట్టిపడేలా మంచి ట్రెడిషన్ వేర్లో కనిపించారు. ఇక మోదీ కాన్వాయ్ వైట్హౌజ్కు చేరుకోగానే వైట్ హౌజ్ ప్రతినిధులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోదీని బైడెన్ ఉన్న గదిలోకి తీసుకెళ్లారు. మోదీని చూసిన అధ్యక్షుడు బైడెన్ ఘన స్వాగతం పలికారు. ఇద్దరూ పరస్పర అభివాదం తెలుపుకున్నారు. మోదీ భారత సంప్రదాయ పద్ధతిలో నమస్కారం చెప్పారు. ఆ తర్వాత ఇద్దరూ అధికారిక చర్చలు ప్రారంభించారు. మోదీ హిందీలో మాట్లాడగా బైడెన్కు అర్థమయ్యేలా ఇంగ్లీషులో ఓ మహిళా అధికారిణి తర్జుమా చేశారు.
ఇరువురి మధ్య జరుగుతున్న సంభాషణ వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జోక్ వేయడంతో ప్రధాని మోదీతో సహా అక్కడి గదిలో ఉన్న విలేఖర్లు కూడా నవ్వారు. భారత్లో ఐదుగురు బైడెన్లు ఉన్నారంటూ జో బైడెన్ జోక్ వేసినట్లు సమాచారం. మరి ప్రధాని మోదీ ఊరుకుంటారా... ఆయన కూడా తన దైన శైలిలో సెటైర్లు వేశారు. తనతో పాటు వంశపారంపర్య చరిత్రను తెలిపే పత్రాలు తీసుకొచ్చానంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఆ గదిలో నవ్వులు పూశాయి.
ఇక అసలు సంగతి ఏంటంటే 2013లో జో బైడెన్ ముంబై వచ్చిన సమయంలో తన దూరపు బంధువులు ముంబైలో ఉన్నారని చెప్పారు. అదే విషయాన్ని రెండేళ్ల తర్వాత వాషింగ్టన్లో మరోసారి చెప్పారు. ముంబైలో ఐదు మంది బైడెన్లు నివసిస్తున్నారని చెప్పారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భారత సమాజంను ఉద్దేశించి ప్రసంగిస్తూ కూడా ఇదే మాట బైడెన్ చెప్పారు.
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశం సందర్భంగా అన్ని అంశాలపై కూలంకుషంగా చర్చించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. టెక్నాలజీ ఇరు దేశాల రూపురేఖలను మార్చివేస్తుందని అన్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య బలమైన బంధానికి విత్తనం నాటినట్లు మోదీ వెల్లడించారు. ఇక చర్చల్లో భాగంగా కరోనా వైరస్, వాతావరణ మార్పులు, క్వాడ్ సమావేశంపై లోతుగా చర్చించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇరు దేశాల అగ్రనాయకుల భేటీకి ముందు జో బైడెన్ తాను ప్రధాని మోదీతో వైట్హౌజ్లో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనబోతున్నట్లు ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండో పసిఫిక్,కోవిడ్-19, వాతావరణంలో మార్పులు లాంటి కీలక అంశాలపై చర్చిస్తామని ట్వీట్ చేశారు.