ఐదు సింహాల దాడి: మృత్యుంజయురాలు
మెల్ బోర్న్: విహారయాత్రకు వెళ్లిన సమయంలో సింహాలు దాడి చేశాయి. ఆయితే ఆ బాలిక మృత్యువును జయించి కోలుకుంటున్నది. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా నివాసి నేహా శర్మ (15) అనే బాలిక ధైర్యం చూసి వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న నేహా శర్మ ఇటివల దక్షిణాఫ్రికాలోని వన్యప్రాణుల పార్కుకు వెళ్లింది. తరువాత పార్క్ లో జంతువులను చూస్తున్న సమయంలో ఒక్క సారిగా ఐదు సింహాలు నేహా శర్మ మీద దాడి చేశాయి. ఆ సందర్బంలో నేహా శర్మ తల, చాతీ, మెడ, కాళ్లకు తీవ్రగాయాలైనాయి.
విషయం గుర్తించిన జంతు సంరక్షకులు వచ్చి సింహాలను తరిమివేశారు. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రిలో నేహా శర్మ చికిత్స పొందుతున్నది. సరైన సమయంలో బాలికను ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రాణాలు నిలబడ్డాయి.
బాలిక ధైర్యంగా చికిత్స పోందుతున్నది, వైద్యులకు సహకరిస్తున్నదని నేహా శర్మ తండ్రి రాఘవ శర్మ అంటున్నారు. తన కుమార్తె కోలుకోవడానికి ఇంకా ఒక సంవత్సరం పడుతుందని రాఘవ శర్మ తెలిపారు.