అంతరిక్షంలో అద్భుతం: ఒకే వరుసలో ఐదు గ్రహాలు
న్యూఢిల్లీ: గత పదేళ్లలో ఎన్నడూ జరగని ఒక అద్భుతం అంతరిక్షంలో చోటు చేసుకుంది. సౌరకుటుంబంలోని ఐదు గ్రహాలు ఒకే వరుసలో కనిపిస్తున్నాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ అపురూపమైన దృశ్యం కనువిందు చేస్తోంది.
ఈ విధంగా ఒకే వరుసలో ఐదు గ్రహాలను ఫిబ్రవరి 20 వరకు వీక్షించొచ్చు. 2005 తర్వాత బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని, గురు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చాయి. అంతరిక్షంలో ఈ అద్భుతం చివరిసారిగా 2004 డిసెంబర్ నుంచి 2005 జనవరి వరకు కనిపించింది.
మళ్లీ ఇప్పుడు ఈ రోదసీ అద్భుతం ఉత్తర ధృవప్రాంతంలో కనిపిస్తుంది. అక్కడైతే అర్ధరాత్రి ఎటువంటి పరికరాలు లేకుండా చూడొచ్చు. కాకపోతే రోజూ కనిపించే నక్షత్రాల నుంచి వాటిని వేరుగా గుర్తించడం కొంచెం కష్టమే. బైనాక్యూలర్ ఉపయోగిస్తే గ్రహాలను మరింత స్పష్టంగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీకి చెందిన డాక్టర్ రాబర్ట్ మెస్సీ ఈ అద్భుతం గురించి మాట్లాడుతూ సూర్యోదయానికి గంట ముందు గ్రహాల వరుస అద్భుంగా కనిపిస్తుందని చెప్పారు. గ్రహాలు డ్యాన్స్ చేస్తున్నాయి, ఈ అద్భుతాన్ని అందరూ బయటకెళ్లి చూడాల్సిందిగా కోరారు.
బుధ గ్రహాన్ని చూసేందుకు ప్రజలు ఎంతో కష్టపడాల్సి ఉంటుందని, అయితే శుక్రుడు, అంగారకుడు, శని, గురు గ్రహాలను బైనాక్యూలర్, టెలిస్కోప్ల ద్వారా వీక్షించొచ్చని తెలిపారు. దీంతో వీటిని చూసేందుకు చాలా మంది ఉత్తర ధృవానికి చేరువగా ఉండే ప్రాంతాలకు వెళుతున్నారు.