పదేళ్ల పాటు హోటల్లో ఆదివారాలు పని: పనిమనిషికి రూ.152 కోట్లు చెల్లించలాని కోర్టు ఆదేశం
ఫ్లోరిడా: ఆదివారం నాడు సెలవు ఇవ్వకుండా పది సంవత్సరాలు ఓ మహిళతో పని చేయించుకున్న ఫ్లోరిడాలోని ఓ హోటల్కు న్యాయస్థానం షాకిచ్చింది. ఈ పదేళ్లకు గాను బాధిత మహిళకు 21.5 మిలియన్ డాలర్లు చెల్లించాలని హోటల్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. అంటే దాదాపు 152 కోట్లకు పైగా చెల్లించాలని ఆదేశించింది.
ప్రార్థనా మందిరానికి వెళ్లడం కోసం వరుసగా ఆదివారాలు ఆ మహిళ హోటల్ విధులకు గైర్హాజరయింది. దీంతో హోటల్ బాస్ ఆమెను తొలగించింది. దీనిపై సదరు మహిళ న్యాయపోరాటం చేసి గెలిచింది. ఆ మహిళ హోటల్లో డిష్ వాషర్గా పని చేసేది.
తొలుత సెలవు ఇచ్చారు కానీ, ఆ తర్వాతే
ఆ హోటల్లో పని చేసే ఆ మహిళ పేరు మేరీ జీన్ పీరే. అరవయ్యేళ్ల వయస్సు ఉంది. ఆమె మియామీ పరిసరాల్లోని హోటల్లో పని చేస్తోంది. ఆమె ఆదివారాల్లో తప్ప మిగతా రోజుల్లో క్రమం తప్పకుండా పనికి వెళ్ళేది. ఆదివారాల్లో ప్రార్థనా మందిరంలో పని చేస్తుంది. తొలుత హోటల్ సిబ్బంది ఆమెకు ఆదివారం సెలవు ఇచ్చారు. కానీ ఆ తర్వాత హోటల్లోని మేనేజర్ ఆమెకు ఆదివారం సెలవు ఇవ్వడం మానేశాడు.
పదేళ్ల పాటు ఆదివారాలు పని చేసింది
ఆదివారం కూడా పనికి రావాలని మేనేజర్ చెప్పగా, పనిమనిషి అంగీకరించలేదు. మేనేజర్ కూడా అశ్సలు అంగీకరించలేదు. దీంతో పదేళ్ల పాటు ఆమె ఆదివారాలు కూడా పని చేసింది. మధ్యలో కొన్ని కారణాల వల్ల తోటి సిబ్బంది సాయంతో ఆదివారం సెలవు తీసుకున్నది. ఈ విషయం తెలిసి, మేనేజర్ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాడు.
హోటల్ సిబ్బంది అవమానించారని
దీంతో మేరీ ఉద్యోగ కమిషన్ను ఆశ్రయించారు. మతం పట్ల తనకున్న నమ్మకాలను హోటల్ సిబ్బంది అవమానించారని ఫిర్యాదు చేసింది. తమ హోటల్లో పని చేస్తున్న ఇతర సిబ్బందికి అన్ని విషయాల్లో మద్దతు తెలుపుతున్న యాజమాన్యం ఆమె విషయంలో మాత్రం వ్యతిరేకత చూపారని ఆమె లాయర్ కోర్టుకు తెలిపారు.
కోర్టు తాజా తీర్పు
ఈ కేసు కొన్నేళ్లు కొనసాగింది. ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. మేరీ మనోభావాలను దెబ్బతీసినందుకు ఎగ్గొట్టిన జీతం మొత్తంతో కలిపి హోటల్ యాజమాన్యం 21.5 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం స్పందించింది. కోర్టు తీర్పు తమను బాధించిందని, కేసులోని నిజానిజాలు తేలకుండా తీర్పు వెలువరించినట్లు అనిపిస్తోందని, మేరీ తమ హోటల్లో పని చేసినంత కాలం ఆమెకు అనుకూలంగా ఉండే షిఫ్ట్లు వేశామని చెప్పింది.