ఉలిక్కిపడ్డ అమెరికా: ఫ్లోరిడాలో టీనేజర్ నరమేధం.. 17మంది మృతి..
ఫ్లోరిడా: అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. గన్ చేతబట్టి ఓ స్కూల్లోకి ఎంటర్ అయిన టీనేజర్.. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 17మంది స్కూల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మధ్యాహ్నాం 3గం. ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనతో ఫ్లోరిడా ఒక్కసారిగా అలర్ట్ అయింది.
అసలేం జరిగింది?:
పార్క్ల్యాండ్లోని మార్జోయ్ స్టోన్మన్ డగ్లస్ హైస్కూల్ స్ట్రీట్ లోకి రాగానే మొదట ఓ వ్యక్తిని కాల్చి చంపాడు దుండగుడు. ఆ తర్వాత స్కూల్లోకి ప్రవేశించి.. గేటు వద్దే ఇద్దరిని కాల్చేశాడు.
గేటు నుంచి స్కూల్లోకి వచ్చి దాదాపు 12మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్నాడు. దుండగుడు బిల్డింగ్ ఫైర్ అలారం మోగించడంతో విద్యార్థులంతా ఒక్కసారి స్కూల్ భవనం నుంచి వచ్చే ప్రయత్నం చేశారు. బయటకొస్తున్న విద్యార్థులను దుండగుడు పిట్టల్ని కాల్చి కాల్చిపారేశాడు.
17మంది మృతి.. నిందితుడు అతనే!:
కాల్పుల్లో మొత్తం 17మంది విద్యార్థులు చనిపోయినట్టు పోలీసులు నిర్దారించారు. మరో 16మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించి ఇందులో ఇద్దరు మృతి చెందినట్టు తెలిపారు. గాయపడ్డ వారిలో మరో ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
కాల్పులకు పాల్పడ్డ దుండగుడిని నికోలస్ క్రూజ్(19)గా పోలీసులు గుర్తించారు. ఇదే పాఠశాలకు చెందిన అతన్ని కొద్దిరోజుల క్రితం యాజమాన్యం సస్పెండ్ చేసినట్టు చెప్పారు.
పోలీసుల అదుపులో నిందితుడు:
కాల్పుల అనంతరం స్కూల్లోనే దాక్కున్న నికోలస్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ క్రమంలో నికోలస్ స్వల్ప గాయాలపాలైనట్టు తెలుస్తోంది. దీంతో అతన్ని కూడా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అమెరికా చరిత్రలో ఎనిమిదోసారి..:
అమెరికా చరిత్రలో ఒక స్కూల్లో ఇంత భారీగా నరమేధం జరగడం ఇది ఎనిమిదోసారి అని తెలుస్తోంది. మదర్ జోన్స్ పబ్లిక్ మాస్ షూటింగ్ డేటా ప్రకారం.. 1982నుంచి పబ్లిక్ మాస్ షూటింగ్స్ జరుగుతున్నట్టు సమాచారం. కాల్పులు జరిగిన ప్రతీసారి కనీసం నలుగురు వ్యక్తులు మృతి చెందినట్టు చెబుతున్నారు.