మామూలు తెలివి కాదు: రూ.1లక్ష వస్తువులను రూ.250కే తీసుకెళ్లారు, మోసం ఇలా!
గేమ్ కంట్రోలర్స్, కంప్యూటర్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లను కొనుగోలుచేసిన అంబెర్.. ఎవరి కంట పడకుండా వాటి ధరల ట్యాగ్స్ ను మార్చారు. తక్కువ రేటు ఉన్న ట్యాగ్స్ వాటికి అతికించారు.
ఫ్లోరిడా: రూ.1లక్షా 30వేల వస్తువులు కొన్న ఓ యువతి బిల్లు మాత్రం రూ.250మాత్రమే చెల్లించింది. అత్యంత చాకచక్యంగా తక్కువ ధర ఉన్న ట్యాగ్స్ ను వాటికి తగిలించి భారీగా బిల్లు ఎగ్గొట్టింది. ఎట్టకేలకు ఆమె మోసాన్ని గుర్తించిన మార్ట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫ్లోరిడాకు చెందిన చెయెన్నీ అంబెర్(25) అనే యువతి ఈ మోసానికి పాల్పడింది. తన తల్లితో కలిసి ఇండియన్ రివర్ కౌంటీ వద్ద ఉన్న వాల్ మార్ట్కు వెళ్లింది. ఇద్దరు కలిసి అక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేశారు.
గేమ్ కంట్రోలర్స్, కంప్యూటర్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లను కొనుగోలుచేసిన అంబెర్.. ఎవరి కంట పడకుండా వాటి ధరల ట్యాగ్స్ ను మార్చారు. తక్కువ రేటు ఉన్న ట్యాగ్స్ వాటికి అతికించారు. దీంతో రూ.1లక్షా 30వేల విలువ చేసే వస్తువులను కేవలం రూ.250కే తీసుకెళ్లిపోయారు.
ఆలస్యంగా మోసాన్ని గుర్తించిన మార్ట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా ఆమెను గుర్తించి అరెస్ట్ చేశారు. నవంబర్ 6వ తేదీన పోలీసులు ఆమెను అరెస్టు చేయగా.. ఆ మరుసటి రోజే రూ.2లక్షల విలువైన బాండ్ చెల్లించి ఆ యువతి విడుదలైంది. తామేమి తప్పు చేయలేదని ఆమె వాదిస్తోంది.
కాగా, ఫ్లోరిడా కోర్టు కేసు తుది తీర్పు డిసెంబర్ 13న వెలువరించనుంది. ఆమె తప్పు నిరూపించబడితే.. ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.3.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.