ఇజ్రాయెల్లో అరుదైన గౌరవం, ఓ పువ్వుకు 'మోడీ' పేరు, ఇదే ఆ ఫ్లవర్...
భారత స్వాతంత్రానంతరం ఇజ్రాయెల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. అంతేకాదు, ఇజ్రాయెల్ ఆయనకు అరుదైన గౌరవం ఇచ్చింది.
జెరూసలేం: భారత స్వాతంత్రానంతరం ఇజ్రాయెల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. అంతేకాదు, ఇజ్రాయెల్ ఆయనకు అరుదైన గౌరవం ఇచ్చింది. ఆ దేశానికి చెందిన ఓ పుష్పానికి మోడీ గౌరవార్థం ఆయన పేరును పెట్టారు.
చదవండి: 70 ఏళ్లుగా ఇజ్రాయెల్ వెయిటింగ్, మోడీ అడుగు: చైనా దూకుడు ఎఫెక్ట్..
క్రిసాన్తిమమ్ జాతికి చెందిన ఓ పుష్పాన్ని ఇకపై 'మోడీ' పూవుగా పిలువనున్నారు. డాన్జిగర్ ఫ్లవర్ ఫార్మ్ను మోడీ సందర్శించిన సందర్భంగా ఈ అరుదైన గౌరవం లభించింది.
ఇజ్రాయెల్లో ఓ భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడు, పోప్లకు ఇజ్రాయెల్ దేశాధినేతలు ఇచ్చే స్వాగత మర్యాదలు ప్రధాని మోడీకి దక్కాయి. ఆ దేశ ప్రధాని నేతన్యాహూ ఎయిర్ పోర్టుకు వచ్చి మోడీకి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మోడీకి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం.
Crysanthumun flower will be named in honour of PM @narendramodi. The flower will be called 'Modi.' pic.twitter.com/4qLALtxHzP
— PMO India (@PMOIndia) July 4, 2017
టెక్నాలజీకి ఇజ్రాయెల్ మార్గదర్శనం
సాంకేతికతకు ఇజ్రాయెల్ మార్గదర్శనం చేస్తోందని తాను, భారతదేశ ప్రజలంతా భావిస్తుంటామని ప్రధాని మోడీ అన్నారు. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచిన ఈ దేశంతో శతాబ్దాలుగా భారత ప్రజలకు సంబంధాలు ఉన్నాయన్నారు.
తన పర్యటనకు ముందే ఇజ్రాయెల్ ప్రభుత్వ అనుకూల పత్రిక 'ఇజ్రాయెల్ హయోమ్'కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇజ్రాయెల్తో భారత్కు ఉన్న సంబంధాలు ప్రత్యేకమైనవనీ, ఉగ్రవాద నిరోధం సహా కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు తన పర్యటన దోహదం చేస్తుందన్నారు.
రెండు దేశాల ప్రజల జీవితాలను మెరుగుపరిచే రీతిలో ఇజ్రాయెల్తో చర్చలు జరపడం తన లక్ష్యమన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను ఉన్నప్పుడు ఇజ్రాయెల్ వ్యవసాయ రంగం గురించి తెలుసుకునేందుకు నిర్వహించిన పర్యటనను మోడీ ప్రస్తావించారు.
దశాబ్దం తర్వాత మళ్లీ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నానని, ఈ దశాబ్దంలో చోటు చేసుకున్న మార్పుల్ని తాను చూడదలిచానన్నారు. ఉగ్రవాదాన్ని మతంతో సరిపోల్చకూడదన్నారు. ఉగ్రవాద బెడద యావత్ ప్రపంచానికీ ఉందన్నారు.