మోడీ హిస్టరీ, ఆసక్తికరం: జోర్డాన్ చాపర్, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ భద్రత (వీడియో)
రమల్లా/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలస్తీనా తొలి పర్యటన చారిత్రాత్మకంగా నిలిచింది. ఇజ్రాయెల్తో జరిపే శాంతి చర్చల్లో భారత్ సహకారాన్ని పాలస్తీనా అధ్యక్షులు మహ్మద్ అబ్బాస్ కోరారు. మోడీ శనివారం రమల్లాలో అబ్బాస్తో చర్చలు జరిపారు.
ఇజ్రాయెల్తో చర్చలకు తాము సిద్ధమని, అయితే కొన్ని షరతులు ఉన్నాయని, తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా ఇజ్రాయెల్ అంగీకరించాలని, 1967 అరబ్ ఒప్పందం ఆధారంగా తాము శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నామని, అంతర్జాతీయ సమాజం తీసుకునే ఏ తిర్మానాన్ని అయినా అనుసరిస్తామని అబ్బాస్ తెలిపారు.
మోడీతో భేటీ అనంతరం అబ్బాస్, మోడీలు మీడియాతో మాట్లాడారు. అన్ని దేశాలతో, ప్రపంచ సంస్థలతో కలిసి ఓ బహుళ పక్ష శాంతి బృందాన్ని ఏర్పాటు చేసి ఇజ్రాయెల్తో, తమతో చర్చలు జరిపి దశాబ్దాలుగా సాగుతున్న సంక్షోభానికి తెరపడేలా చూడాలని మోడీని కోరారు. భారత్ చొరవ తీసుకోవాలని, ఒప్పంచగలరన్నారు.
దీనికి వెంటనే మోడీ ఆమోదించకపోయినా సర్వ స్వతంత్ర పాలస్తీన్ ఆవిర్భావాన్ని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు జరిగాయి.
History in the making. In a first-ever visit by an Indian Prime Minister to Palestine, PM @narendramodi on the way to Ramallah in a chopper provided by Jordan government and escorted by choppers from Israel Air Force. pic.twitter.com/Nx7AtyLS8W
— Raveesh Kumar (@MEAIndia) February 10, 2018
ఇదిలా ఉండగా అబుదాబిలోనే అతిపెద్ద హిందూ దేవాలయానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 55000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించే ఈ దేవాలయంలో అందరి దేవతల ప్రతిమలు ఉంటాయి. 2020 కల్లా దీని నిర్మాణం పూర్తవుతుంది. అబుదాబీలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి ఈ విషయం చెప్పారు. ఎమిరేట్స్లో ఓ హిందూ దేవాలయ నిర్మాణం ఇదే మొదలు.
మోడీ పాలస్తీనా పర్యటనలో ఆసక్తికరం. ఆయన జోర్డాన్ సమకూర్చిన చాపర్లో రమల్లాకు వెళ్లారు. ఈ చాపర్కు ఇజ్రాయయెల్ ఎయిర్ ఫెర్స్ భద్రత కల్పించడం గమనార్హం.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య దీర్ఘకాలంగా శత్రుత్వం నడుస్తుండగా మోడీ పర్యటన ఆ విభేదాలను పక్కన పెట్టేలా చేసిందని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ పేర్కొన్నారు. మోడీ కొత్త చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో మోడీ ప్రయాణిస్తున్న చాపర్ వీడియో పెట్టారు.
దాదాపు 150 కిలో మీటర్ల దూరాన్ని మోడీ హెలికాప్టర్లో ప్రయాణించగా జోర్డాన్, ఇజ్రాయెల్, పాలస్తీన్ ఎయిర్ స్పేస్ను ఖాళీ చేయించిన మూడు దేశాల ప్రభుత్వాలు, సరిహద్దుల వద్ద భారీ భద్రతను, క్షిపణి విధ్వంసక యంత్రాలను మోహరించాయి. మోడీ చాపర్లో వెళ్తుంటే రక్షణగా నిలిచిన మరో చాపర్ నుంచి తీసిన వీడియో అది.