'ఇండియన్ ఆర్మీ మాటలు కాదు.. చేతల్లో చూపిస్తుంది'
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ మాటల్లో కాకుండా చేతల్లో సత్తా చూపుతుందని ఎయిర్ ఫోర్సెస్ చీఫ్ అరూప్ రాహా అన్నారు. గత నెల 29న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్పై రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు చెలరేగాయి.
ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ భద్రతకు ఎదురయ్యే ఎలాంటి సవాళ్లన్నైనా ఎదుర్కొనేందుకు సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సర్జికల్ స్ట్రయిక్ పైన దేశంలో చాలా చర్చ జరుగుతోందని, సమాజంలోని ప్రతి వర్గం దీనిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోందన్నారు.
దేశం ఆశించిన ఫలితాన్ని అందించడం సైనిక దళాల విధి అన్నారు. దీనిపై మేం మాట్లాడమని, చేతల్లోనే చూపుతామన్నారు. సర్జికల్ స్ట్రయిక్ నేపథ్యంలో చెలరేగిన రాజకీయ రగడ పైన విలేకరులు ప్రశ్నించగా ఆన పైవిధంగా స్పందించారు.
టెర్రరిస్టులు తెచ్చిన గ్రెనేడ్లు పాకిస్తాన్లో తయారీవే
కాశ్మీర్లో హతమైన ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న గ్రనేడ్లు పాకిస్థాన్ ప్రభుత్వ గుర్తులు ఉన్నాయి. గురువారం నౌగాం సెక్టర్లో జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించగా, వారి వద్ద నుంచి సేకరించిన చేతి గ్రెనేడ్లు , యూబీజీఎల్ గ్రెనేడ్లపై పాకిస్థాన్ ఆయుధ కర్మాగారం ముద్రలు ఉన్నాయని తెలిపారు.
ఇదిలా ఉండగా, భారత్ జాతి వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న యాపిల్ పళ్లు హర్యానాలో బయటపడ్డాయి. సిర్సాలోని మార్కెట్కు యాపిళ్లు కొనుగోలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి కొన్నింటిపై నినాదాలు రాసి ఉండటం గమనించారు. కాశ్మీరీ యాపిళ్లుగా వ్యాపారులు విక్రయిస్తున్న వాటిపై కలంతో రాసిన పదాలను పరిశీలించి చూడగా కొన్ని విద్వేష పూరిత నినాదాలు కనిపించాయి.