దమ్ముంటే పీఓకేను కాపాడుకోండి: బిలావుల్ భుట్టో కీలక వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : కశ్మీర్ అంశంలో అవసరమైతే భారత్పై అణుయుద్ధం చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మెన్ బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కూడా కశ్మీర్ను పాక్ సాధిస్తుందని చెప్పుకొచ్చారని కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే పాక్లో ఉన్న ముజఫరాబాద్ను కాపాడుకోవడం కష్టంగా మారిందనే వ్యాఖ్యలు చేశారు. ముజఫరాబాద్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం బలహీనమైన విధానాలతో పీఓకేను తీసుకురావడం అసాధ్యమైన పని అని బిలావర్ భుట్టో ఓ సభను ఉద్దేశించి ప్రసంగించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడితో సమావేశం అనంతరం ఇరు నేతలు కశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశమని పేర్కొన్న విషయాన్ని బిలావర్ భుట్టో గుర్తుచేశారు. వీరి సమావేశం తర్వాత పాక్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్... కశ్మీర్ కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు అణ్వాయుధాలు ప్రయోగించడానికైనా పాకిస్తాన్ వెనకాడబోదంటూ ఇమ్రాన్ఖాన్ హెచ్చరించారు. కశ్మీర్ అంశం భారత అంతర్గత విషయమని కొద్దిరోజుల క్రితం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో లేవనెత్తుతోందని ఆర్టికల్ 370 రద్దు అనే విషయం భారత అంతర్గత వ్యవహారమన్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్ పై మాత్రమే భారత్ పాకిస్తాన్తో చర్చించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఆగష్టు 5న జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆపై విభజన చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ కడుపు మంటతో అల్లాడిపోతోంది. పలు అంతర్జాతీయ దేశాల దృష్టికి తమకేదో అన్యాయం జరిగినట్లు తీసుకెళ్లి చతికిలపడింది. ఒక్క చైనా తప్ప పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన దేశాలు ఏమీ లేవు. అంతేకాదు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పదేపదే కోరినప్పటికీ అది ద్వైపాక్షి అంశం కాబట్టి తమ జోక్యం ఉండబోదని ఆయా దేశాలు స్పష్టం చేశాయి.