దేశద్రోహి ముద్ర: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రాఫ్ కు ఉరిశిక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రాఫ్ కు మరణ శిక్ష పడింది. పెషావర్ లోని ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువడించింది. పర్వేజ్ ముషర్రాఫ్ ను చాలాకాలం నుంచి వెంటాడుతోన్న హైట్రిజన్ కేసులో పెషావర్ న్యాయస్థానం ఈ తీర్పును ఇవ్వడం సంచలనం రేపుతోంది. తన పాలనా సమయంలో పర్వేజ్ ముషర్రాఫ్ దేశద్రోహానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణలపై పెషావర్ లోని ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వకార్ అహ్మత్ సేఠ్ సారథ్యంలో జస్టిస్ నజర్ అఖ్తర్, జస్టిస్ షాహిద్ కరీంలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసులపై సమగ్ర విచారణ నిర్వహించింది. నజర్ అఖ్తర్ సింధ్ హైకోర్టుకు, షాహిద్ కరీం లాహోర్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు.
పర్వేజ్ ముషర్రాఫ్ పై వచ్చిన ఆరోపణలు, పిటీషన్లు, ఇతర సాక్ష్యాధారాలపై విచారణ జరిపిన అనంతరం ఈ మేరకు సంచలన తీర్పును ఇచ్చింది. ప్రస్తుతం పర్వేజ్ ముషర్రాఫ్ దుబాయ్ లో నివసిస్తున్నారు. 2009 నుంచి 2013 వరకు ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పని చేశారు. సైనిక ప్రభుత్వాన్ని కొనసాగించారు. ఈ చర్య దేశద్రోహం కిందికి వస్తుందంటూ అప్పట్లో ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటన్నింటినీ విచారించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది.