20ఏళ్లకు దొంగిలించిన సొమ్ముతోపాటు వడ్డీ చెల్లించిన వెయిట్రెస్: చలించిన యజమాని
వాషింగ్టన్: తన యజమాని పట్ల తనకున్న నిజాయితీని నిరూపించుకుంది ఓ వెయిట్రెస్. రెండు దశాబ్దాల క్రితం తాను పనిచేసిన రెస్టారెంట్లో డబ్బు దొంగిలించిన సదరు వెయిట్రెస్ పశ్చాత్తాపంతో ఇప్పుడా సొమ్మును వడ్డీ సహా పంపింది. అంతేగాక, ఓ క్షమాపణ లేఖను కూడా జోడించింది.
తన క్షమాపణను అంగీకరించాలని, డబ్బులు తీసుకోవాలని అందులో కోరింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టక్సన్లో ఉన్న మెక్సికన్ రెస్టారెంట్ 'ఎల్ చారో కేఫ్' యజమాని చార్లొట్టా ఫ్లోరెస్కు జూన్ 27న ఓ కవర్ అందింది. అందులోని లేఖను చదివిన చార్లొట్టా ఆశ్చర్యపోయింది.
'1990లలో యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో చదువుకుంటూ మీ రెస్టారెంట్లో పని చేశాను. వెయిట్రెస్గా పనిచేసిన నేను తోటి వెయిట్రెస్ ప్రోద్బలంతో పాకెట్ మనీ కోసం కొంత డబ్బు దొంగిలించి తప్పు చేశాను. ఇప్పటికి 20 ఏళ్లు అయినా.. ఆ తప్పు నన్ను ఇంకా వెంటాడుతోంది' అని ఆ లేఖలో పేర్కొంది.
అంతేగాక, 'రెస్టారెంట్లో దొంగతనానికి పాల్పడిన నన్ను మీరు క్షమించాలి. నా క్షమాపణను స్వీకరించడంతోపాటు, దొంగిలించిన సొమ్ముకు 20 ఏళ్ల వడ్డీతో కలిపి పంపుతున్న వెయ్యి డాలర్లను స్వీకరించండి. దేవుడు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ మేలు చేస్తాడు' అని ఆ లేఖలో తెలిపింది. ఈ లేఖను చదివిన రెస్టారెంట్ యజమాని సహా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. సదరు వెయిట్రెస్ను నెటిజన్లు అభినందిస్తున్నారు.