కరోనా బారినపడి అమెరికాలో నలుగురు భారతీయులు మృతి
వాషింగ్టన్: అమెరికాలో కరోనవైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి అమెరికాలో లక్షా 13వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. 2వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, అమెరికాలో కరోనబారిన పడి నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ మేరకు ఉత్తర అమెరికా కేరళ సమాఖ్య తెలిపింది. తనకచన్ ఎంచనట్టు(51), కురియకోస్(65), అబ్రహం శామ్యూల్(45), ష్వాన్ అబ్రహం(21)లు కరోనాసోకి అమెరికాలోని న్యూయార్క్లో మరణించారని వెల్లడించింది. మృతుల కుటుంబాలకు సమాఖ్య తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
కాగా, కరోనా సోకినవారి కుటుంబాలతో నిరంతరం మాట్లతాడుతున్నామని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఒక్క న్యూయార్క్లోనే 63వేలకుపైగా బాధితులు ఉండటం గమనార్హం.
ఇక మనదేశంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4281కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 319 మంది కోలుకున్నారు. 111 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గత 24 గంటల్లో 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు, 28 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 51 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 303కు దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది.
తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 45 మందిని డిశ్చార్జ్ చేశాం. 11 మంది చనిపోయారు. ప్రస్తుతం 308 మంది బాధితులు సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కేసీఆర్ చెప్పారు.