నేపాల్ రాజకీయ సంక్షోభం... చైనా జోక్యం... ఖాట్మండుకు నలుగురు సభ్యుల బృందం...
నేపాల్ రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నలుగురు సభ్యుల బృందాన్ని అక్కడికి పంపించనుంది. ఈ బృందానికి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వైస్ మినిస్టర్ గువో యెజౌ నేత్రుత్వం వహించనున్నారు. ఆదివారం(డిసెంబర్ 26) నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకోనున్న ఈ బృందం అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించి... కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన రెండు గ్రూపులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.
ప్రస్తుతం నేపాల్లో కమ్యూనిస్టు పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. రెండేళ్ల క్రితం ఒకే గొడుగు కిందకు చేరి అధికారంలోకి వచ్చిన కేపీ ఓలీ శర్మ నేత్రుత్వంలోని సీపీఎన్ యూఎంఎల్, పుష్ప కమల్ దహల్ ప్రచండ నేత్రుత్వంలోని సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరడంతో ఈ చీలిక తప్పలేదు. ఈ రెండు పార్టీలు విలీనమై 2018లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(సీపీఎన్)గా ఏర్పడ్డాయి.
ఆ తర్వాత నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావడంతో కేపీ శర్మ ఓలీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రచండ పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే ప్రధాని హోదాలో ఉన్న కేపీ శర్మ పార్టీని సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రచండ వర్గం కేపీ శర్మపై ఆరోపణలు చేసింది. కేపీ వర్గంపై అవినీతి ఆరోపణలు కూడా చేసింది. ఈ విభేదాలు తారాస్థాయికి చేరడంతో కేపీ శర్మ ఓలీ 275 మంది సభ్యుల పార్లమెంటు దిగువ సభను రద్దు చేశారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు.
మరోవైపు పార్లమెంట్ రద్దు రాజ్యాంగ విరుద్దమని ప్రచండ వర్గం సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నేపాల్ రాజకీయ సంక్షోభంలో చైనా కల్పించుకుంటోంది. భారత్ పట్ల సానుకూల వైఖరితో ఉండే ప్రచండను తమ దారికి తీసుకొచ్చేందుకే చైనా రాజకీయ జోక్యం చేసుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ మాత్రం అది నేపాల్ అంతర్గత వ్యవహారమని ఆ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. చైనా జోక్యంతో నేపాల్ రాజకీయ సంక్షోభం ఏ టర్న్ తీసుకోబోతుందన్న ఆసక్తి నెలకొంది.