జస్ట్ 12 గంటల్లో.. 4 రైలు ప్రమాదాలు! వరుస దుర్ఘటనలతో ప్రయాణికుల్లో భయాందోళనలు!!
ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 12 గంటల వ్యవధిలో 4 రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయంలోపు ఈ నాలుగు ప్రమాదాలు జరిగాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 12 గంటల వ్యవధిలో 4 రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయంలోపు ఈ నాలుగు ప్రమాదాలు జరిగాయి. ఈ వరుస ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ దుర్ఘటనల్లో ఏడుగురు మరణించగా, 11 మంది గాయపడ్డారు. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే మూడు ప్రమాదాలు జరిగాయి. వాస్కోడగామా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు, అతడి తండ్రి, ఓ గుర్తు తెలియని వ్యక్తి మరణించారు. ఈ ప్రమాదంలో మరో 9 మంది గాయపడ్డారు.
గోవా నుంచి పాట్నా వెళుతున్న ఈ రైలు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రారంతంలో యూపీలోని మాణిక్పూర్ రైల్వే స్టేషన్లో ఆగి, బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి లోనైంది. ఈ ఘటనలో మొత్తం 13 బోగీలు పట్టాలు తప్పాయి.
పట్టాలు విరిగిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ఎమర్జెన్సీ బ్రేకులు ఫెయిలవడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే మంత్రి పియూష్ గోయల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అటు రైల్వే శాఖ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి నష్ట పరిహారం ప్రకటించాయి. గురువారం రాత్రి యూపీలోని అమేథీ సమీపంలో కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.
పెళ్లి బృందం పయనిస్తున్న బొలెరో వాహనాన్ని లోకల్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు మాణిక్పూర్ ప్రమాదం జరిగిన రెండు గంటల్లోపే ఒడిశాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది.
పారాదీప్ నుంచి కటక్ వెళుతున్న ఈ రైలు శుక్రవారం ఉదయం 5.55 గంటలకు గోరఖ్నాథ్-రఘునాథ్పూర్ మధ్య ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు.
యూపీలో జమ్ము-పట్నా అర్చన ఎక్స్ప్రెస్ ఇంజన్ రైలు నుండి రెండుసార్లు విడిపోయింది. మొదట శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఈ ఘటన జరిగింది. ఇంజన్ను రైలుకు బిగించి 3.17 గంటలకు గీన్ర్ సిగ్నల్ ఇచ్చారు.
కానీ 5.25 గంటల ప్రాంతంలో మళ్లీ ఇంజిన్ వేరుపడింది. రెండు గంటల పాటు సీనియర్ అధికారులు, సిబ్బంది మరమ్మతులు చేసి క్లియరెన్స్ ఇచ్చారు. ఈ వరుస ప్రమాదాల కారణంగా పలు మార్గాల్లో రైళ్లు ఆలస్యంగా నడిచాయి.