గర్ల్ ఫ్రెండ్ పరారీ: ఫ్రాన్స్లో మరిన్ని దాడుల భయం
పారిస్: ఊచకోతకు కారణమైన ఇద్దరు సోదరులను ఫ్రాన్స్ బలగాలు కాల్చి చంపిన నేపథ్యంలో కూడా మరిన్ని దాడులు జరగవచ్చుననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓ మహిళా అనుమానితురాలు తప్పించుకోవడమే ఆ భయాందోళనలకు కారణం. ఉగ్రవాదుల దాడిలో 12 మంది మరణించిన విషయం తెలిసిందే.
పోలీసులు మరో అనుమానితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరణించిన ఇద్దరు సోదరుల్లో ఒకరి గర్ల్ ఫ్రెండ్గా భావిస్తున్న మహిళ శనివారం తెల్లవారు జామున తీవ్రమైన కాల్పుల నేపథ్యంలో తప్పించుకున్నట్లు భావిస్తున్నారు. ఆదివారం జరిగే ఐక్యతా మార్చ్కు తాను హాజరవుతానని అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే చెప్పారు. జర్మనీ, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్లకు చెందిన నేతలతో పాటు వందలాది మంది ఈ మార్చ్కు హాజరయ్యే అవకాశం ఉంది.
నిఘా వర్గాలకు తెలిసినప్పటికీ భద్రతా వలయం నుంచి సోదరులు చెరిఫ్, సయీద్ కౌచీ, సూపర్ మార్కెట్ గన్మన్ అమేడీ కౌలిబాలీ ఎలా జారిపోయారనేది అంతు చిక్కడం లేదు. కౌలిబాలీ ప్రేయసి హయత్ బౌమెడ్డీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని అమెరికా తన పౌరులను హెచ్చరించింది.
గత మూడు రోజుల పాటు ప్యారిస్ను గుప్పిట పట్టి భయోత్పాతాన్ని సృష్టించిన ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఫ్రాన్స్ పోలీసులు తమ ఆపరేషన్లో కాల్చి చంపేశారు. శుక్రవారం మరో ఐదుగురిని బందీలుగా తీసుకుని అలజడి రేకెత్తించిన మిలిటెంట్లను పట్టుకునేందుకు ఏకంగా 2వేలమంది పోలీసులు రంగంలోకి దిగి అన్ని వైపులనుంచి వారిని కట్టడి చేశారు. తీవ్ర స్థాయిలో ఉత్కంఠ, అలజడి నేపథ్యంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
బందీలకు ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా విడిపించారు. అంతకుముందు దేశ రాజధాని ప్యారిస్ తూర్పు ప్రాంతంలోని కోషెర్ సూపర్ మార్కెట్లో శుక్రవారం ఐదుగురిని నిర్బంధించి ఉగ్రవాదులు సరికొత్త డ్రామాకు తెర లేపారు. గురువారం ఒక మహిళా పోలీసును కాల్చిచంపినట్లు అనుమానిస్తున్న ఆగంతకుడే తాజాగా కోషెర్ మార్కెట్లో దాడికి దిగినట్లు అధికారులు భావిస్తున్నారు.