మళ్లీ ఉలిక్కిపడ్డ ఫ్రాన్స్: మహిళ తల నరికిన దుండగుడు, మరో ఇద్దరి హత్య.. ఉగ్రవాదుల చర్యేనా..!
ఫ్రాన్స్ : కొద్ది రోజుల క్రిత్రం ఫ్రాన్స్లో ఓ స్కూలు టీచర్ తలను నరికిన ఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఒక మహిళ తలను కత్తితో నరికి ఆ పై మరో ఇద్దరిపై కత్తితో దాడి చేయడంతో వారు కూడా మృతి చెందారు. ఈ ఘటన నైస్ నగరంలోని ఓ చర్చిలో జరిగింది. ఇది ఉగ్రవాదుల చర్యే అని నైస్ నగర మేయర్ చెప్పారు. నైస్ నగరంలోని నాటర్డామ్ చర్చి దగ్గర దుండగుడు ముగ్గురిపై దాడి చేశాడని అతన్ని పోలీసులు పట్టుకున్నారని నగర మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసి ట్విటర్ ద్వారా వెల్లడించారు.
నేడే అధ్యక్ష ఎన్నికలు: బ్రిటన్ బాటలోనే ఫ్రాన్స్?
ఇక దాడి ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరికొంత మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఓ మహిళ శిరచ్చేధం చేయబడిందని పోలీసులు వివరించారు. ఇక ఘటనపై విచారణ చేసేందుకు ఫ్రెంచ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఇక ఘటన జరిగిన చర్చి చుట్టూ పోలీసు బలగాలు మోహరించి ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో అంబులెన్స్లు, ఫైరింజన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో శామ్యూల్ పాటీ అనే టీచర్ తల నరికిన ఘటన మరువక ముందే మరోసారి ఫ్రాన్స్ రక్తమోడటంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. స్కూలు విద్యార్థులకు మొహ్మద్ ప్రవక్త కార్టూన్లు చూపించడంతో ఆ దుండగుడు టీచర్ తలను నరికేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే తాజాగా నైస్ నగరంలో జరిగిన ఘటనకు స్కూలు టీచర్ హత్యకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. స్కూలు టీచర్ హత్య అనంతరం చాలామంది సానుభూతి పరులు మొహ్మద్ ప్రవక్త కార్టూన్లను బహిరంగంగా ప్రదర్శించడంపై పలు ముస్లిం దేశాలు ఫ్రాన్స్ ప్రభుత్వంపై ఆ దేశాధ్యక్షుడు మాక్రాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇస్లాంకు వ్యతిరేకంగా మాక్రాన్ వ్యవహరిస్తున్నారని ముస్లిం దేశాధినేతలు మండిపడ్డారు.