కల్లోల లంకలో తాజా ఉగ్రదాడి: మరో రెండు చోట్ల శక్తిమంతమైన బాంబు పేలుళ్లు
కొలంబో: భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఆత్మాహూతి దాడుల వరుస దాడులతో అల్లకల్లోలంగా తయారైన శ్రీలంకలో తాజాగా మరో ఘోరం చోటు చేసుకుంది. మరో రెండు శక్తిమంతమైన బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.. రాజధాని కొలంబోలోని దేహివాలా జూతో పాటు క్యాపిటల్ సిటీ పరిధిలోని దిమాటిగోడా ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం వెంటవెంటనే బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
శ్రీలంక నరమేథం! ఐసిస్ పనే! జిహాదీలుగా నిర్ధారణ
దేహివాలా జూ ప్రాంతంలో చోటు చేసుకున్న పేలుడులో ఇద్దరు మరణించారు. దీనితో మొత్తంగా మృతుల సంఖ్య 160కి చేరుకుంది. దిమాటిగోడ ప్రాంతంలో సంభవించిన పేలుడులో మృతుల సంఖ్య ఎంత అనేది ఇంకా తెలియరాలేదు. ఈ రెండు పేలుళ్లలోనూ పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విధానం కింద చికిత్స అందిస్తున్నారు. తాజా ఘటనలతో సహా మొత్తంగా శ్రీలంకలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడిలో మృతుల సంఖ్య 160కి చేరుకుంది.
11 చోట్ల బాంబులు పేలుతాయని ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్..
శ్రీలంకలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులు ముందే పసిగట్టారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గుడ్ ఫ్రైడే లేదా ఈస్టర్ సండే లేదా మరో పర్వదినాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు సంభవించే అవకాశాలు ఉన్నాయంటూ తాము 10 రోజుల కిందటే ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు పోలీసు ఉన్నతాధికారి పుజుత్ జయసుందర తెలిపారు.
కొలంబోలోని భారత హైకమిషనర్ కార్యాలయం సహా కనీసం 11 చోట్ల లేదా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడి ఉండే ప్రాంతాలపై బాంబు దాడులు చోటు చేసుకోవచ్చని ముందే పసిగట్టామని ఆయన అన్నారు. దీనికి సంబంధించి.. ఈ నెల 11వ తేదీన కీలక సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేసినట్లు చెప్పారు. నేషనల్ త్రోహీత్ జమాత్ - ఎన్టీజే అనే సంస్థ ఆత్మాహూతి దాడులకు పాల్పడవచ్చని తమకు విశ్వసనీయ సమాచారం అందిందని జయసుందర వెల్లడించారు.
ప్రముఖ క్రైస్తవ ప్రార్థనా స్థలాలే లక్ష్యంగా ఈ దాడులు చోటు చేసుకుంటాయని పక్కాగా సమాచారం అందిందని అన్నారు. భారత హైకమిషనర్ కార్యాలయాన్ని కూడా టార్గెట్ గా చేసుకుంటారని తమకు అందిన సమాచారంలో తేలినట్లు చెప్పారు. దీనిపై తాము ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని జయసుందర అన్నారు.
తాజాగా ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తోంటే.. ఇంటెలిజెన్స్ అధికారుల అంచనా గానీ, అనుమానాలు గానీ వాస్తవ రూపం దాల్చినట్లు చెప్పుకోవచ్చు. అయినప్పటికీ.. వాటిని నిరోధరించడంలో అక్కడి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందనేది చర్చనీయాంశమౌతోంది. తొలుత ఆరు చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడం.. మధ్యాహ్నం ఏడో బాంబ దాడి కూడా సంభవించడం నివ్వెరపరుస్తోంది.