కలకలం: ప్యారిస్లో మళ్లీ కాల్పులు, మహిళా పోలీస్ మృతి, మరోచోట పేలుడు
ప్యారిస్: ప్యారిస్లో బుధవారం నాటి దుండగుల కాల్పుల పైన ఓ వైపు నిరసనలు, ఆందోళనలు జరుగుతుండగానే మరోవైపు, గురువారం నాడు మరో సంఘటన జరిగింది. మోంట్రోగ్లో పోలీసుల పైన ఓ సాయుధ దుండగుడు కాల్పులు జరిపి మెట్రో రైలులో పరారయ్యాడు. దుండగుడి కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడు గాయపడ్డారు. ఓ పోలీసుకు తీవ్రంగా గాయాలయ్యాయి.
బుధవారం చార్లీ హెబ్డోలో జరిగిన కాల్పులకు దీనికి లింక్ ఏమైనా ఉందోనని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, చార్లీ హెబ్డోలో జరిగిన కాల్పుల విషయమై ఫ్రెంచ్ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మహిళా పోలీసు అధికారి మృతి
మోంట్రోగ్లో దుండగుడి కాల్పుల్లో గాయపడిన మహిళా పోలీసు అధికారి మృతి చెందారు. దుండగుడు బుల్లెట్ ప్రూఫ్ ధరించి వచ్చి కాల్పులు జరిపి, మెట్రో రైలులో పారిపోయాడు. గాయపడ్డ మరో పోలీసు అధికారి, పౌరుడు చికిత్స పొందుతున్నారు.
మోంట్రోగ్లో కాల్పులు జరిగిన గంటలోనే మరోసారి ఫ్రాన్స్లో దారుణం జరిగింది. లియోన్లోని మసీదు వద్ద ఓ రెస్టారెంటులో భారీ పేలుడు సంభవించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం కాలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయం పైన దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుంటే రూ.51 కోట్లు ఇస్తానని బహుజన్ సమాజ్ వాది పార్టీ నేత హాజీ యాకుబ్ ఖురేషీ ప్రకటించారు. లక్నోలో ఆయన మాట్లాడారు. ఎవరైనా ఈ అవార్డు అందుకోవచ్చునని చెప్పారు.
అయితే, 2006లో ఆయనే చార్లీ హెబ్డో మేగజైన్లో ప్రచురితమైన కార్టూన్ మహ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా ఉందని, ఆ కార్టూనిస్టును చంపిన వారికి రూ.51 కోట్లు ఇస్తామని ప్రకటన చేశారు. అప్పుడు చార్టీ హెబ్డో తీరును తప్పు పట్టారు. ఆ పత్రిక ఇస్లాంను పదేపదే అవహేళన చేస్తోందన్నారు.