ఒకేసారి మోడీ, షింజో అబేలతో భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 30, డిసెంబర్ 1న బ్యూనస్ ఏరిస్లో జరగనున్న జీ 20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబేలతో ఏకకాలంలో భేటీ అవుతారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలతో ట్రంప్ పలు అంశాలపై చర్చించనున్నట్లు వైట్ హౌజ్ తెలిపింది.
జీ-20 సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న 20 దేశాలకు చెందిన అగ్రనేతలు హాజరుకానున్నారు. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తిగా మారనుంది. ఇదే సదస్సు సందర్భంగా జిన్పింగ్తో ట్రంప్ సమావేశమవుతారు. అంతేకాదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా ట్రంప్ భేటీ అవుతారు. జీ 20 సమావేశానికి ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్జెంటీనా అధ్యక్షుడు మారిసియో మాక్రితో సమావేశం అవుతారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జాన్ బోల్టన్ చెప్పారు.
ఆ తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్లతో భేటీ అవుతారని చెప్పారు. ఇదిలా ఉంటే ట్రంప్ షింజో అబేలతో సమావేశంలో మోడీ కూడా ఒకేసారి పాల్గొంటారని వైట్హౌజ్ వర్గాలు వెల్లడించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో విందు సమావేశంలో ట్రంప్ భేటీ అవుతారని బోల్టన్ వెల్లడించారు.