రాహుల్గాంధీ వింత వ్యాఖ్యలు.. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ కూడా ఎన్నారైలేనట!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వింత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. భారత స్వాతంత్య్ర సమరయోధులు ఎన్నారైలని, ఎన్నారై ఉద్యమంతోనే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని రాహుల్ వ్యాఖ్యానించారు.
న్యూయార్క్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వింత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. భారత స్వాతంత్య్ర సమరయోధులు ఎన్నారైలని, ఎన్నారై ఉద్యమంతోనే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని రాహుల్ వ్యాఖ్యానించారు.
నిజానికి అసలు కాంగ్రెస్ ఉద్యమం ఒక ఎన్నారై ఉద్యమం. గాంధీ ఓ ఎన్నారై, నెహ్రూ ఇంగ్లండ్ నుంచి వచ్చారు. అంబేద్కర్, ఆజాద్, పటేల్.. వీళ్లంతా ఎన్నారైలే.. అని రాహుల్ అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నారై మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.
తన వ్యాఖ్యలను సమర్థించుకునే వివరణ కూడా ఆయన ఇచ్చారు. వీళ్లలో ప్రతి ఒక్కరూ బయటి ప్రపంచానికి వెళ్లారు. చూశారు. ఇండియాకు తిరిగొచ్చి వాళ్ల ఆలోచనలతో ఇండియాను మార్చారు అని రాహుల్ చెప్పారు.
ఇండియా అభివృద్ధికి పాటుపడుతున్న ఎంతో మంది ఎన్నారైలు ఇంకా గుర్తింపునకు నోచుకోవడం లేదని ఆయన అన్నారు. నిజానికి క్షీర విప్లవాన్ని ప్రారంభించిన వర్గీస్ కురియస్ కూడా ఓ ఎన్నారై అని ఈ సందర్భంగా రాహుల్ గుర్తుచేశారు.
కురియన్ అమెరికా నుంచి వచ్చి ఇండియాను మార్చారు. ఇండియాకు అతిపెద్ద విజయమైన క్షీర విప్లవాన్ని ఆయన ప్రారంభించారు. ఇలాంటివి ఎన్నో వేల ఉదాహరణలు ఉన్నా మనం గుర్తించలేదు అని రాహుల్ చెప్పారు.
ఎన్నారైలు ఇండియాకు వెన్నుముకలాంటి వాళ్లని, బయటి దేశంలో సెటిలైనంత మాత్రాన వాళ్లు దేశ అభివృద్ధికి తోడ్పాడునందించడం లేదనడం సరికాదని అన్నారు. తన దృష్టిలో ఇండియా ఒక ఆలోచనల గని అని, ఇండియా కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ ఇండియనే అని రాహుల్ చెప్పారు. ఇక దేశంలో అసహనం పెరిగిపోతున్నదంటూ బీజేపీ ప్రభుత్వాన్ని రాహుల్ దుయ్యబట్టారు.