అమెరికా గమనిస్తోంది!: యూఎస్ హౌజ్లో ఐలయ్య, గౌరీ లంకేష్ల ప్రస్తావన..
ఈ సందర్భంగా ఫ్రాంక్స్.. జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య, ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ఎదురవుతున్న బెదిరింపులను హౌజ్ లో ప్రస్తావించారు.
వాషింగ్టన్: భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్చ పట్ల ఇక్కడి ప్రభుత్వాలు, సమాజం అనుసరిస్తున్న వైఖరిని అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది. రచయితలు, మేదావులు, జర్నలిస్టులు తమ పరిశోధనలు, రచనలను చర్చకు లేవనెత్తిన సందర్భాల్లో ఎదురవుతున్న సంక్లిష్టతలను వారు అర్థం చేసుకుంటున్నారు.
గత కొంతకాలంగా భారతదేశంలో జరుగుతున్న మేదావుల హత్యలు, రచయితలకు ఎదురవుతున్న బెదిరింపుల నేపథ్యంలో అమెరికన్ రిపబ్లికన్ పార్టీ మెంబర్ ట్రెంట్ ఫ్రాంక్స్ ఈ అంశాన్ని అక్కడి హౌజ్లో లేవనెత్తారు. ఇండియాలో భావప్రకటనా స్వేచ్చకు ఎదురవుతున్న అడ్డంకులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎవరీ కంచ ఐలయ్య?: వివాదాల చట్రంలోకి ఎలా వచ్చారు..
ఈ సందర్భంగా ఫ్రాంక్స్.. జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య, ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ఎదురవుతున్న బెదిరింపులను హౌజ్లో ప్రస్తావించారు. ఇంటర్నెట్లో తమ అభిప్రాయాలను పంచుకునే స్వేచ్చ కూడా లేకుండా.. ఆఖరికి వారిని చంపడానికి కూడా వెనుకాడట్లేదని ఫ్రాంక్ విచారం వ్యక్తం చేశారు.
'అధికార పార్టీల అప్రజాస్వామిక విధానాలను ఏమాత్రం భయపడకుండా గౌరీ లంకేష్ విమర్శించారు. పదునైన విమర్శకు ఆమె పెట్టింది పేరు' అంటూ ఫ్రాంక్స్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా లంకేష్ లాగే గతంలో హత్యకు గురైన హేతువాదులు గోవింద్ పన్సారే, ఎంఎం కల్బుర్గీ, నరేంద్ర ధబోల్కర్ పేర్లను కూడా ఆయన హౌజ్ లో ప్రస్తావించారు. ఈ నలుగురి హత్యలు ఒకే తరహాలో జరిగాయని చెప్పారు.
ఇక ఇటీవలి కాలంలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఎదుర్కొంటున్న బెదిరింపుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. 'ఐలయ్య తనకు రక్షణ లేదని భావించబట్టే తనకు తాను హౌజ్ అరెస్ట్ చేసుకున్నారు' అని పేర్కొన్నారు.
దళిత రచయిత ఐలయ్య ఎదుర్కొంటున్న బెదిరింపులపై యూఎస్ హౌజ్ తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ఐలయ్య భావ ప్రకటనా స్వేచ్చ ఎట్టి పరిస్థితుల్లోను ఉల్లంఘించబడకూడదని, ఆ దిశగా భారతీయ ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించాల్సిన అవసరముందని ఫ్రాంక్స్ స్పష్టం చేశారు. భారతీయ ప్రభుత్వం అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.