రసాయనశాస్త్ర నోబెల్ ప్రకటన - జన్యు మార్పులపై పరిశోధనకు గుర్తింపుగా ఇద్దరికి...
2020 సంవత్సరానికి రసాయనశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇవాళ ప్రకటించారు. ఈ ఏడాది రసాయన నోబెల్ను ఇద్దరు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ప్రకటించారు. జన్యు పరిశోధనల్లో చేసిన కృషికి గుర్తింపుగా ఎమాన్యుయేల్ ఛార్పెంటియర్, జెన్నిఫర్ దౌడ్నా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సంయుక్తంగా గెల్చుకున్నారు.
క్రిస్ప్ర్-కాస్ 9 పేరుతో చేసిన ఆవిష్కరణ ద్వారా జీవన కణాలలో ఉన్న డీఎన్ఏకి నిర్దిష్ట మరియు ఖచ్చితమైన మార్పులు చేసే మార్గాన్ని వీరు అభివృద్ధి చేశారు. ఇది జన్యు సాంకేతిక పరిజ్ఞానం యొక్క పదునైన సాధనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వీటిని ఉపయోగించి శాస్త్రవేత్తలు జంతువులు, మొక్కలు మరియు సూక్ష్మజీవుల డీఎన్ఏను చాలా కచ్చితంగా మార్చేందుకు వీలు కలుగుతోంది. దీంతో ఈ ఆవిష్కరణను ఈ ఏడాది రసాయన నోబెల్కు రాయల్ స్వీడిష్ అకాడమీ ఎంపిక చేసింది.
Recommended Video
స్వీడన్కు చెందిన ఆల్ఫెడ్ నోబెల్ పేరుతో ఇస్తున్న ఈ పురస్కారం కింద విజేతలకు స్వర్ణపతకంతో పాటు 10 మిలియిన్ స్వీడిష్ క్రోనార్ల నగదు బహుమతి అందుతుంది. ఈసారి ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని పంచుకుంటారు. ఇప్పటికే నోబెల్ ప్రైజ్ నిర్వాహకులు వైద్య, భౌతిక, రసాయనశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. మిగిలిన పురస్కారాలను వచ్చే వారం రోజుల్లో ప్రకటన పూర్తి కానుంది. ఆర్దిక, సాహిత్య, శాంతి విభాగాల్లో నోబెల్ పురస్కారాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.