అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాంటి అవినీతి లేదు, కలిసి పనిచేద్దాం: జార్జ్ డబ్ల్యూ బుష్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డబ్ల్యూ బుష్ తాజాగా ముగిసిన అధ్యక్ష ఎన్నికలపై స్పందించారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రాథమికంగా ఎలాంటి అవినీతి లేకుండా జరిగాయని అమెరికా ప్రజలు విశ్వసించవచ్చని రిపబ్లికన్ పార్టీ నేత బుష్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ నువ్వే..: గెలుపును ముందే చెప్పిన కమలా హారీస్ మేనమామ
తాజా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా ఉందని బుష్ అన్నారు. దేశం కోసం ప్రతి ఒక్కరూ తిరిగి ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్కు శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక, రిపబ్లికన్ పార్టీలో ఆయన తర్వాత దేశాధ్యక్ష పదవి చేపట్టిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అభినందనలు తెలిపారు.
70 మిలియన్ల ఓట్లు సాధించడం రాజకీయపరంగా గొప్ప విజయమని ట్రంప్నకు పోలైన ఓట్లను ఉద్దేశించి బుష్ వ్యాఖ్యానించారు. రీకౌంటింగ్ ను కోరడంతోపాటు ఎన్నికల ఫలితాలపై చట్టపరంగా పోరాడే హక్కు ట్రంప్నకు ఉందని బుష్ స్పస్టం చేశారు.
జో బైడెన్ విజయాన్ని అంగీకరించిన జార్జ్ డబ్లూ బుష్.. ఆయనకు అభినందనలు తెలియజేశారు. కాగా, 2016లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడిన బుష్ సోదరుడు జెట్ బుష్.. జో బైడెన్కు ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మాజీ అధ్యక్షులు, చాలామంది రిపబ్లికన్ సెనెటర్లు కూడా బైడెన్ విజయాన్ని స్వాగతిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.
రిపబ్లికన్ సెనేటర్లు ఉటాకు చెందిన మిట్ రోమ్నీ, అలాస్కాకు చెందిన లిసా ముర్కోవ్స్కీ కూడా బిడెన్కు అభినందనలు తెలిపారు. ఇంకా చాలా మంది రిపబ్లికన్ అధికారులు.. అన్ని ఓట్లు ఇంకా లెక్కించబడలేదని, అన్ని సవాళ్లు పరిష్కరించబడలేదని చెప్పారు.
కాగా, ఇటీల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనల్డ్ ట్రంప్ ఓటమిపాలయ్యారు. జో బైడెన్కు అత్యధికంగా 290 ఎలక్టోరల్ ఓట్లు రాగా, డొనాల్ ట్రంప్నకు 214 ఓట్లు వచ్చాయి.